1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
  4. Digital India project,

డిజిటల్ ఇండియాతో 18 లక్షల ఉద్యోగాలు : నరేంద్ర మోడీ

Digital India project
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం మరో ప్రతిష్టాత్మక పథకానికి శ్రీకారం చుట్టింది. ఢిల్లీలో డిజిటల్ ఇండియా ప్రాజెక్టును ఆయన ప్రారంభించారు. 2019 నాటికి దేశంలోని 2,50,000 గ్రామాలను బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ ద్వారా అనుసంధానించడం ఈ ప్రాజెక్టు లక్ష్యం. తద్వారా ఈ-గవర్నెన్స్, అనుసంధానిత ఆర్థికవ్యవస్థగా మార్చాలనేది ప్రభుత్వ ఉద్దేశం. అలాగే, ఈ పథకం ద్వారా 18 లక్షల ఉద్యోగ అవకాశాలు వస్తాయని ఆయన చెప్పుకొచ్చారు. 
 
ఈ సందర్భంగా మోడీ ప్రసంగిస్తూ ప్రజల కలలను సాకారం చేయడంలో ఇది కొత్త అడుగన్నారు. ఒకనాడు నదీతీరాల వెంబడి నాగరికతలు వెలిశాయని, ఆధునికకాలంలో కమ్యూనికేషన్ ఉండేచోట్ల అభివృద్ధి జరుగుతుందన్నారు. నగరాలు, గ్రామాల మధ్య సదుపాయాల కల్పనలో అంతరాలు ఉన్నాయని.. ఇప్పుడు డిజిటైజేషన్ చేసుకోకపోతే ఈ అంతరాలు మరింత పెరిగిపోతాయన్నారు. 
 
డిజిటైజేషన్ ద్వారా పారదర్శక పరిపాలన సాధ్యమవుతుందని చెప్పారు. ప్రజాసేవల రంగంలో డిజిటల్ ఇండియా విప్లవాత్మక మార్పు తీసుకొస్తుందన్నారు. హైస్పీడ్ డిజిటల్ హైవేలు దేశాన్ని ఒకటిగా చేయనున్నాయని తెలిపారు. పారిశ్రామికవేత్తల నుంచి వస్తున్న స్పందన ఆశలు రేకెత్తిస్తున్నదని.. రూ. 4.5లక్షల కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ప్రతిపాదనలు వచ్చాయన్నారు. దీనిద్వారా 18లక్షల ఉద్యోగావకాశాలు వస్తాయని చెప్పారు. డిజైన్ ఇన్ ఇండియా డిజిటల్ ఇండియాకు మొదటిమెట్టు కావాలని చెప్పారు. 
About Writer
PNR