శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 28 మే 2019 (17:21 IST)

చంద్రబాబు నిరాయుధుడు... ప్లీజ్ వదిలివేయండి.. : నాగబాబు

అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ చిత్తుగా ఓడిపోవడం, ముఖ్యమంత్రి పదవికి చంద్రబాబు రాజీనామా చేయడంపై జనసేన పార్టీ నేత, సినీ నటుడు నాగబాబు స్పందించారు. ఎన్నికల్లో ఓడిపోయినంత మాత్రాన చంద్రబాబును టార్గెట్ చేసుకుని ట్రోల్ చేయడం సబబు కాదన్నారు. ప్రత్యర్థి నిరాయుధుడై ఎదురుగా ఉన్నప్పుడు ఆయన్ను వదిలివేయాలేగానీ దాడి చేయరాదన్నారు. 
 
అసెంబ్లీ ఎన్నికల్లో వైకాపాకు 151, టీడీపీకి 23, జనసేనకు ఒక్క సీటు చొప్పున సీట్లు వచ్చాయి. లోక్‌సభ ఎన్నికల్లో వైకాపాకు 22 ఎంపీ సీట్లు, టీడీపీకి మూడు సీట్లు వచ్చాయి. దీంతో చంద్రబాబును లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో విమర్శలు చేస్తూ, వాటిని ట్రోలింగ్ చేస్తూ కొందరు పైశాచికానందం పొందుతున్నారు. దీనిపై నాగబాబు స్పందించారు. 
 
"చంద్రబాబు గారు మన మాజీ సీఎం, ఇపుడు ఓటమిపాలైనంతమాత్రాన ఆయనను దారుణంగా విమర్శించడం తప్పు. మనిషి పవర్‌లో ఉండగా విమర్శించడం వేరు, ఓడిపోయాక విమర్శించడం చేతకానితనం. ప్రత్యర్థి నిరాయుధుడై ముందు నిలబడితే వదిలెయ్యాలి. అంతేకానీ, అవకాశం దొరికింది కదాని ట్రోల్ చేయడం ఒక శాడిజం" అని నాగబాబు పోస్ట్ చేశారు. 
 
కాగా, చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నాగబాబు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఇపుడు ఉన్నట్టుండి చంద్రబాబుకు అనుకూలంగా వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది.