శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 28 మే 2019 (12:07 IST)

కమ్మ పార్టీ అని ముద్రవేశారు... నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర : చంద్రబాబు

తెలుగుదేశం పార్టీని ఒక వర్గానికి చెందిన పార్టీగా ముద్రవేశారని, టీడీపీ అంటే బడుగు బలహీన వర్గాల పార్టీ అని ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ఓటమి తర్వాత ఆయన మంగళవార తొలిసారి బయటకు వచ్చారు. గుంటూరులోని పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన పార్టీ వ్యవస్థాపకుడు స్వర్గీయ ఎన్.టి.రామారావు జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. 
 
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, ఎన్నికల్లో ఓడిపోవడం కొంతబాధగా ఉన్నప్పటికీ ప్రజలు ఇచ్చిన తీర్పును శిరసావహించాన్నారు. పార్టీ ఎపుడు కష్టాల్లో ఉన్నా కార్యకర్తలే అండగా నిలబడ్డారని గుర్తు చేశారు. ఇపుడుకూడా మనమంతా ఐక్యంగా ఉండి పార్టీకి తిరిగి పూర్వవైభవం తీసుకుని రావాలన్నారు. టీడీపీ ఒక వర్గానికి చెందిన పార్టీ కాదనీ, ఇది బలహీన వర్గాల పార్టీ అని చెప్పుకొచ్చారు. 
 
తాజాగా ఎన్నికల్లో గెలిచినవారు.. అనేక రకాలైన హామీలను ఇచ్చారనీ, అవి నెరవేర్చేందుకు కొంత సమయం ఇద్దామన్నారు. అదేసమయంలో టీడీపీకి దాదాపుగా 40 శాతం ఓట్లు వచ్చాయన్నారు. అంటే 40 శాతం మంది ఓటర్లకు మనం సేవ చేయాల్సివుందన్నారు. అందువల్ల అసెంబ్లీలో నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్రను పోషిద్దామని చంద్రబాబు పిలుపునిచ్చారు. 
 
అలాగే, ప్రజాసేవలో తనకు స్ఫూర్తినచ్చిన నేత స్వర్గీయ ఎన్టీఆర్ అని, ఆయన అడుగుజాడల్లో ముందకు సాగుదామన్నారు. ఎన్టీఆర్ అంటే ఒక వ్యక్తికాదనీ ఓ శక్తి, ఓ వ్యవస్థ అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆయన చూపిన బాటలో నడుస్తూ, ఆయన ఆశయాల సాధన కోసం పునరంకితమవుదామని చంద్రబాబు పిలుపునిచ్చారు.