1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 9 జులై 2021 (21:53 IST)

ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ విడుదల.. ఆగస్టు 15 నుంచి పాఠశాలలు

ఏపీ రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీల పరిధిలో జరిగే కామన్ ఎంట్రన్స్ పరీక్షల తేదీలను విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ శుక్రవారం వెల్లడించారు. ఆయా పరీక్షల నిర్వహణకు చైర్మన్, కన్వీనర్లను నియమించిన తర్వాత వివరాలను విడుదల చేశారు. 
 
అందుకు సంబందించిన తేదీలు, పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఆగస్టు 19-25 ఈఏపీ సెట్ , సెప్టెంబర్ 17,18 తేదీల్లో ఐ సెట్‌, సెప్టెంబర్ 19న ఈ సెట్‌, సెప్టెంబర్ 27-30 పీజీ ఈసెట్‌, సెప్టెంబర్ 21 ఎడ్‌ సెట్‌, సెప్టెంబర్ 22 లా సెట్‌.
 
ఆగస్టులోపు విద్యాసంస్థల్లో నాడు-నేడు పెండింగ్ పనులు పూర్తి కావాలని అధికారులను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. ఈ నెల 15 నుంచి ఆగస్టు 15వరకు వర్క్‌బుక్స్‌పై ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వాలని తెలిపారు. ఆగష్టు 15 తర్వాత పాఠశాలలు ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఆగష్టు 15 లోపు టీచర్లకు వ్యాక్సినేషన్‌ వేసేందుకు కార్యాచరణ రూపొందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
 
 నాడు-నేడు కింద పనుల కోసం రూ.16 వేల కోట్లతో బడ్జెట్ సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు. నాడు నేడు, జగనన్న విద్యా కానుకపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష చేపట్టారు. 
 
ఈ సమావేశానికి విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌, విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు. నూతన విద్యా విధానం అమలుకు తీసుకోవాల్సిన చర్యలపై సీఎం సమీక్షించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య, విద్యావంతులైన నైపుణ్యం గల టీచర్లతో బోధన అందించాలని తెలపారు. మెరుగైన మౌలిక సదుపాయాలు, విద్యార్థుల సంఖ్యకు తగినట్లుగా టీచర్లు ఉండాలన్నారు. ఈ లక్ష్యాల కోసమే నూతన విద్యా విధానం అమలు చేస్తున్నామన్నారు. 
 
ఒక్క స్కూల్‌ కూడా మూసివేయకూడదని, ఒక్క టీచర్‌ను కూడా తొలగించకూడదని ఆదేశించారు. నూతన విద్యా విధానం ప్రతిపాదనలను ఈ వారంలో ఖరారు చేయాలన్నారు. నాడు-నేడు పనులను యథావిధిగా కొనసాగించాలని, షెడ్యూల్‌ ప్రకారం పనులు పూర్తికావాలని అధికారులను ఆదేశించారు.