1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 4 జనవరి 2020 (21:21 IST)

వైకుంఠ ఏకాద‌శికి స‌ర్వం సిద్ధం

తిరుమ‌ల‌లో జ‌న‌వ‌రి 6న వైకుంఠ ఏకాద‌శి, 7న ద్వాద‌శి ప‌ర్వ‌దినాల‌కు ఏర్పాట్లు పూర్త‌య్యాయ‌ని, భ‌క్తుల‌కు ఎలాంటి అసౌక‌ర్యం క‌ల‌గ‌కుండా జాగ్ర‌త్త‌లు తీసుకున్నామ‌ని టిటిడి ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ తెలిపారు.

తిరుమ‌ల‌లోని అన్న‌మ‌య్య భ‌వ‌నంలో శ‌నివారం అద‌న‌పు ఈవో ఎవి.ధ‌ర్మారెడ్డి, సివిఎస్వో గోపినాథ్ జెట్టితో క‌లిసి ఈవో మీడియా స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఈవో మాట్లాడుతూ.. గ‌త అనుభ‌వాల‌ను దృష్టిలో ఉంచుకుని ఈసారి విఐపిల‌కు, సామాన్య భ‌క్తుల‌కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప‌క‌డ్బందీగా ఏర్పాట్లు చేప‌ట్టామ‌న్నారు.

జ‌నవరి 6న ఉదయం ధ‌నుర్మాస కైంక‌ర్యాల అనంత‌రం 2 గంటల నుండి వైకుంఠ ద్వార దర్శనం ప్రారంభమవుతుంద‌ని,  ఉదయం 5 గంటల నుండి సర్వదర్శనం ప్రారంభిస్తామ‌ని చెప్పారు. విఐపిల‌తోపాటు సామాన్య భ‌క్తుల‌కు మ‌హాల‌ఘు ద‌ర్శ‌నం ఉంటుంద‌ని స్ప‌ష్టం చేశారు.

జనవరి 5వ తేదీ ఉద‌యం నుండి భక్తులను క్యూలైన్ల‌లోకి అనుమతిస్తామ‌ని తెలిపారు. ముందుగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌-2, ఆ త‌రువాత నారాయ‌ణ‌గిరి ఉద్యాన‌వ‌నాల్లోని షెడ్లు, మాడ వీధుల్లోని షెడ్లు, చివ‌ర‌గా క‌ల్యాణ‌వేదికలో భ‌క్తుల‌ను నింపుతామ‌న్నారు. క్యూలైన్ల‌లో ఎక్కువ సేపు నిల‌బ‌డ‌కుండా త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకున్న‌ట్టు చెప్పారు.

భ‌క్తుల‌కు అన్న‌ప్ర‌సాదాలు, అల్పాహారం, తాగునీరు, టి, కాఫి పంపిణీకి ప్ర‌ణాళికాబ‌ద్ధంగా ఏర్పాట్లు చేశామ‌ని, 172 ప్రాంతాల్లో 3 ల‌క్ష‌ల తాగునీటి బాటిళ్లు సిద్ధంగా ఉంచుకున్నామ‌ని వివ‌రించారు. 9 ల‌క్ష‌ల ల‌డ్డూలు నిల్వ ఉంచిన‌ట్టు తెలిపారు. 

టిటిడి అద‌న‌పు ఈవో ఎవి.ధ‌ర్మారెడ్డి మాట్లాడుతూ శ్రీ‌వాణి ట్ర‌స్టుకు విరాళాలందించిన దాత‌ల‌కు  వైకుంఠ ఏకాద‌శికి 2500 మందికి, ద్వాద‌శికి 2500 మందికి అవ‌కాశం క‌ల్పించామ‌న్నారు. వీరు ఉద‌యం 10 గంట‌ల‌కు వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌-1 వ‌ద్ద రిపోర్టు చేయాల్సి ఉంటుంద‌ని, మ‌హాల‌ఘు ద‌ర్శ‌నం క‌ల్పిస్తామ‌ని తెలియ‌జేశారు.

వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌-2, నారాయ‌ణ‌గిరి ఉద్యాన‌వ‌నాల్లోని షెడ్లు, మాడ వీధుల్లోని షెడ్లు, క‌ల్యాణ‌వేదికలో క‌లిపి 85 వేల మంది భ‌క్తులు కూర్చునేందుకు ఏర్పాట్లు చేప‌ట్టామ‌న్నారు. షెడ్ల‌కు అనుబంధంగా మ‌రుగుదొడ్లు ఏర్పాటు చేశామ‌న్నారు.
 
టిటిడి సివిఎస్వో గోపినాథ్ జెట్టి మాట్లాడుతూ మొద‌ట వ‌చ్చే భ‌క్తుల‌ను ఆళ్వార్ ట్యాంక్ విశ్రాంతి గృహం వ‌ద్ద గ‌ల‌ ప్ర‌వేశమార్గం ద్వారా ముందుగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌, ఆ త‌రువాత నారాయ‌ణ‌గిరి ఉద్యాన‌వ‌నాల్లోని షెడ్ల‌లోకి పంపుతామ‌న్నారు.

ఆ త‌రువాత వ‌చ్చే భ‌క్తుల‌ను మేద‌ర‌మిట్ట వ‌ద్ద గ‌ల ఎన్‌1 ప్ర‌వేశ‌మార్గంలో డ‌బ్ల్యు 7 గేటు ద్వారా మాడ వీధుల్లోకి అనుమ‌తిస్తామ‌ని తెలిపారు. ద‌క్షిణ మాడ వీధిలో 6,500 మంది, ప‌డ‌మర మాడ వీధిలో 14,000 మంది, ఉత్త‌ర మాడ వీధిలో 19,000 మంది, తూర్పు మాడ వీధిలో 4,000 మంది భ‌క్తులు కూర్చునేందుకు అవ‌కాశం ఉంద‌న్నారు. చివ‌ర‌గా వ‌చ్చే భ‌క్తుల‌ను క‌ల్యాణ‌వేదిక వ‌ద్ద అనుమ‌తిస్తామ‌ని తెలిపారు. 
 
ఏకాద‌శి నాడు మెరుగ్గా సేవ‌లందించాలి
వైకుంఠ ఏకాద‌శి, ద్వాద‌శి రోజుల్లో వైకుంఠ ద్వార ప్ర‌వేశానికి విచ్చేసే భ‌క్తులు 24 గంట‌ల‌కు పైగా కంపార్ట్‌మెంట్లు, షెడ్ల‌లో వేచి ఉంటార‌ని, వారంద‌రికీ అంకిత‌భావంతో మెరుగైన సేవ‌లందించాల‌నే  ప్ర‌ధాన ఉద్దేశంతో శ్రీ‌వారి సేవ‌కులను, స్కౌట్ల‌ను ఆహ్వానించామ‌ని టిటిడి ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ తెలిపారు. 
 
వైకుంఠ ఏకాద‌శి సేవా విధుల‌కు విచ్చేసిన శ్రీ‌వారి సేవ‌కులు, స్కౌట్ల‌ను ఉద్దేశించి శ‌నివారం తిరుమ‌ల‌లోని ఆస్థాన‌మండ‌పంలో ఈవో ప్ర‌సంగించారు. భ‌క్తుల్లో భ‌గ‌వంతుని ద‌ర్శించి  సేవ‌లందించాల‌ని కోరారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌-2, నారాయ‌ణ‌గిరి ఉద్యాన‌వ‌నాల్లోని షెడ్లు, మాడ వీధుల్లోని షెడ్లు, క‌ల్యాణ‌వేదికలో క‌లిపి 85 వేల మంది భ‌క్తులు కూర్చునేందుకు ఏర్పాట్లు చేప‌ట్టామ‌న్నారు.

భ‌క్తుల‌కు అన్న‌ప్ర‌సాదాలు, అల్పాహారం, తాగునీరు, టి, కాఫి పంపిణీకి ప్ర‌ణాళికాబ‌ద్ధంగా ఏర్పాట్లు చేశామ‌ని, మ‌రుగుదొడ్ల వ‌స‌తి క‌ల్పించామ‌ని వివ‌రించారు. మొత్తం 3500 మంది శ్రీ‌వారి సేవ‌కుల‌ను ఆహ్వానించామ‌ని, అన్న‌ప్ర‌సాద‌ విత‌ర‌ణ‌కు 1,500 మంది, విజిలెన్స్ విభాగంలో 1000 మంది, తాగునీటి పంపిణీకి 800 మంది సేవ‌లందిస్తార‌ని తెలిపారు.

మొత్తం 1300 మంది స్కౌట్స్ అండ్ గైడ్స్ భ‌క్తుల‌కు సేవ‌లందిస్తార‌ని తెలియ‌జేశారు. ముందుగా శ్రీ స‌త్య‌సాయి సేవా సంస్థ ఆధ్వ‌ర్యంలో భ‌జ‌న కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు.
 
ఈ కార్య‌క్ర‌మంలో టిటిడి అద‌న‌పు ఈవో ఎవి.ధ‌ర్మారెడ్డి, టిటిడి పిఆర్వో డా.టి.ర‌వి, అన్న‌ప్ర‌సాదం డెప్యూటీ ఈవో నాగ‌రాజు, ఆరోగ్య‌శాఖాధికారి డా. ఆర్ఆర్‌.రెడ్డి, ఏపిఆర్వో కుమారి పి.నీలిమ‌, ఏఈవో యు.ర‌మేష్‌, ఏఇ వ‌ర‌ప్ర‌సాద్‌, శ్రీ‌వారి సేవ కార్యాల‌య సిబ్బంది పాల్గొన్నారు.