గురువారం, 19 సెప్టెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , బుధవారం, 13 అక్టోబరు 2021 (18:14 IST)

మూడు రాజధానులు ఆంధ్రప్రదేశ్‌ నాశనానికే!

మూడు రాజధానులు ఆంధ్ర ప్రదేశ్‌ నాశనానికి దారి తీస్తాయి, అమరావతిలోనే ఒకే ఒక్క శాశ్వత రాజధాని కొనసాగుంపుపై తక్షణం పునరాలోచన చేయాలంటూ సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు డిమాండ్‌ చేసారు. అమరావతిలో రాజధాని కొన‌సాగించాల‌ని గుంటూరు జిల్లా మోతడక గ్రామంలో జరుగుతున్న దీక్షలు 666వ రోజుకు చేరిన సందర్భంలో బుధవారం ధర్నా శిబిరంలో మహా సమ్మేళనం జరిగింది. ముఖ్య అతిధిగా హాజరైన ముప్పాళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్‌ భవిష్యత్‌ తలరాతలు మార్చగల్గేది అమరావతి రాజధాని ఒక్కటే అన్నది సి.ఎం వై.ఎస్‌.జగన్‌ గుర్తెరగాలని అన్నారు. భవిష్యత్తులో రాష్ట్ర ఆర్ధిక అభివృద్ధి నిర్మాణ కేంద్రం కాగలదన్నారు. ఇక ఈ ఉద్యమాన్ని రాష్ట్రమంతటా విస్తరింపచేసి ఉదృతం చేయాలన్నారు. 
 
న‌వంబర్‌ 1వ తేదీ నుంచి తిరుమలకు ప్రారంభం అయ్యే పాదయాత్రలో సి.పి.ఐ భాగస్వామ్యం కాగలదన్నారు. హైకోర్టు న్యాయవాది చిగురుపాటి రవీంద్ర బాబు రచించిన గేయాలను కళాకారులు పివి రమణ, రాజేష్‌ ఆలపించిన ‘‘అమరావతి ఉద్యమ గీతాలు’’ ఆడియో సి.డి లను గ్రామ సర్పంచ్‌ పార్వతమ్మ  జిల్లా పరిషత్‌ మాజీ చైర్‌పర్సన్‌ కూచిపూడి విజయమ్మ ఆవిష్క‌రించారు.
 
సభలో మాజీ శాసన సభ్యులు వైవి ఆంజనేయులు, జెఎసి కన్వీనర్‌ సుధాకర్‌, విజయవాడ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు నిమ్మరాజు చలపతిరావ్‌, తెలుగు రైతు గుంటూరు పార్లమెంట్‌ నియోజక కన్వీనర్‌ కళ్లం రాజశేఖర రెడ్డి, జెఎసీ నేతలు కంచర్ల శివరామయ్య, డాక్టర్‌ రాయపాటి శైలజ, కంచర్ల సాంబశివరావు, స్వరాజ్య రావు, రఘునాధ రావు, అనీల్‌, మన్నవ శారద, కె.శ్రీనివాసరావు, పోతుల బాలకోటయ్య తదితరులు ప్రసంగించారు.