కేవలం 11 సీట్లా..? ఇంత ఘోరంగా ఓడిపోతామని కలలో కూడా ఊహించలేదు : అంబటి
గత ఎన్నికల్లో కేవలం 11 సీట్లలో గెలుచుకోవడాన్ని వైకాపా నేతలు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. మా పార్టీకి కేవలం 11 సీట్లు మాత్రమేనా? ఇంత ఘోరంగా ఓడిపోతామని కలలో కూడా ఊహించలేదని వైకాపా సీనియర్ నేత అంబటి రాంబాబు అంటున్నారు.
'రాష్ట్రంలో మరోసారి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారనుకున్నాం. కానీ ఓడిపోయాం. అలా ఇలా కాదు.. ఘోరంగా ఓటమి పాలయ్యాం. కేవలం 11 సీట్లు మాత్రమే గెలుచుకున్నాం. ఓటమిని ఒప్పుకోవాల్సిందే' అని మాజీ మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు.
అనకాపల్లి జిల్లా కశింకోటలో శుక్రవారం వైకాపా అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జిగా మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. వైకాపాకు 11 సీట్లు ఎందుకు వచ్చాయో అర్థం కాలేదన్నారు. పోనీ మనకు అర్థం కాలేదంటే ఫర్వాలేదు... కూటమికి 164 సీట్లు ఎందుకు వచ్చాయో వారికీ కాలేదని వ్యాఖ్యానించారు.
'ఇద్దరు, ముగ్గురు కలవడం వల్ల అన్ని సీట్లు వచ్చాయా? వైకాపాపై తెలియని వ్యతిరేకత ఏమైనా ఉందా? లేకపోతే ఏదైనా మాయ జరిగిందా? అన్న అనుమానాలు ఉన్నాయి. ఏదేమైనా ఓటమి పాలయ్యాం. పంట సరిగా పండలేదు.
తిరిగి వ్యవసాయం చేయాలి. పార్టీ పునర్నిర్మాణ కార్యక్రమంలో భాగంగానే జగన్ చోడవరం మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీని అనకాపల్లి పార్లమెంట్ ఇన్ఛార్జిగా నియమించారు' అని చెప్పారు. నాయకులు, కార్యకర్తల మధ్య విభేదాలు ఉంటే పక్కన పెట్టాలని సూచించారు. ఎమ్మెల్సీలు బొత్స సత్యనారాయణ, వరుదు కల్యాణి తదితరులు పాల్గొన్నారు.