శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By మోహన్
Last Updated : మంగళవారం, 2 ఏప్రియల్ 2019 (13:44 IST)

ఓపెన్ గానే తిట్లు : చింతలపూడిలో అంబికా కృష్ణ వర్సెస్ పీతల సుజాత

ఆంధ్రప్రదేశ్‍‌లో ఎన్నికల పోలింగ్ తేదీ దగ్గరపడే కొద్దీ అధికార పార్టీలోని నేతలు బాహాటంగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. చింతలపూడి నియోజకవర్గం టీడీపీలో ఇదే పరిస్థితి బయటపడింది. నియోజకవర్గం జంగారెడ్డిగూడెంలో జరిగిన టీడీపీ ఆర్యవైశ్య సభ రసాభాసగా మారింది. 
 
మాజీ మంత్రి పీతల సుజాత నియోజకవర్గాన్ని పట్టించుకోలేదని మాజీ ఎమ్మెల్యే అంబికా కృష్ణ అనడంతో.. అక్కడే ఉన్న సుజాత అనుచరులు అంబికా కృష్ణతో వాగ్వాదానికి దిగారు. దీంతో మంత్రిగా ఉండి సుజాత నియోజకవర్గంలో చేసిందేమి లేదని, అభివృద్ధి శూన్యమని, పాపాలు తగలకూడదనే సీఎం చంద్రబాబు సుజాతకు సీటు ఇవ్వలేదంటూ అంబికా కృష్ణ ఘాటు వ్యాఖ్యలు చేసారు.
 
టీడీపీ కార్యకర్తలు రెండు వర్గాలుగా చీలిపోయి వాగ్వాదానికి దిగారు. ఓ దఫాలో కొట్టుకోబోయారు. వారి మధ్య తోపులాట జరిగింది. అయితే పోలింగ్ సమయంలో నియోజకవర్గం అభివృద్ధి చెందలేదంటూ సొంత పార్టీ నేతలే ఆరోపణలు చేస్తుంటే ప్రచారానికి ఎలా వెళ్లాలంటూ ఆమె అనుచరులు మండిపడ్డారు.
 
పార్టీ పరువును రోడ్డున పడేశారంటూ టీడీపీ నేతలు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజా పరిణామాలు, వర్గ పోరుతో సొంత క్యాడరే టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థికి ప్రతికూల అంశాలుగా మారినట్లు చెబుతున్నారు. ప్రస్తుతం నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్న పీతల సుజాతకు కాకుండా కర్రా రాజారావుకు టికెట్ ఇచ్చారు. 
 
ఈ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి కర్రా రాజారావుకు వైసీపీ అభ్యర్థి వీఆర్ ఎలిజకు మధ్య గట్టి పోటీ ఉంది. అంబికా కృష్ణ బహిరంగంగానే పీతల సుజాతపై విమర్శలు, ఆరోపణలు చేయటం వల్ల బరిలో ఉన్న అభ్యర్థికి ఇది ఇబ్బందికర పరిణామంగా మారింది.