శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By మోహన్
Last Updated : మంగళవారం, 2 ఏప్రియల్ 2019 (13:29 IST)

డ్రై ఫ్రూట్స్‌తో దండ : పొలిటికల్ పుత్రరత్నానికి రాచమర్యాద

అధికారంలో ఉన్న రాజకీయ నాయకులకు మర్యాదలు ఓ రేంజ్‌లో ఉంటాయన్న సంగతి తెలిసిందే. అయితే వారికి మించి తమ పుత్రరత్నాలకు కూడా దక్కుతుంటాయి. రాజకీయంగా లబ్ధి పొందేందుకు తాపత్రాయ పడేవారు ఆయా నాయకుల పుత్రరత్నాలకు మర్యాదలు చేస్తుంటారు. ఈ క్రమంలో కొందరు నాయకుల కుమారులు లేదా కుమార్తెల జపం చేస్తుంటారు. ఇప్పుడు కర్ణాటక రాష్ట్రంలోనూ ఇదే పరిస్థితి నెలకొని ఉంది. 
 
కన్నడనాట వంశపారంపర్య పార్టీగా వెలుగుతున్న జె.డి.(ఎస్‌)లో మాజీ ప్రధాని దేవగౌడ మనవడు, ప్రస్తుత కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి కొడుకు నిఖిల్‌ గౌడకు ఇప్పుడు అటువంటి రాచ మర్యాదలే జరుగుతున్నాయి. నిఖిల్ ఈ లోక్‌సభ ఎన్నికల్లో మాండ్య నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నాడు. ఇంత రాజకీయ బ్యాక్ గ్రౌండ్ ఉన్న నిఖిల్ గౌడ రాచమర్యాదలు ఎలా ఉంటుందో ఊహించవచ్చు.
 
మాండ్య ఎంపీ బరిలో ఉన్న నిఖిల్‌కు స్వాగతం పలికేందుకు స్థానిక నాయకుడు కార్తీక్ గౌడ వెరైటీ దండను తయారు చేయించాడు. బాదం, ఎండుద్రాక్షలతో 300 కిలోల దండను తయారు చేయించాడు. దీంతో ఈ వెరైటీ దండ తయారీకి ఎంత ఖర్చు అయ్యుంటుందోనని స్థానికులు లెక్కలు వేసారు. ఈ లెక్కన దీని తయారీ ఖర్చు రూ.1.80 లక్షలుగా తేలింది. అభిమానానికి కూడా ఓ హద్దు ఉంటుందని, అది మరీ ఇంతలా ఉంటుందా అని స్థానికులు ఆశ్చర్యపోతున్నారు. 
 
ఈ దండ బరువు, ఖర్చు ఏమో గానీ..ఆ దండను మెడలో వేయించుకుంటే నిఖిల్ పరిస్థితి ఏలా ఉంటుందని అనుకుంటున్నారు. కాగా ఆ దండ తయారీదారుడు మాట్లాడుతూ.. నిఖిల్ కోసం తయారు చేసిన ఈ దండ‌ను తయారు చేయడానికి 20 మంది పని చేసారని విభిన్నమైన (పూల)దండలు తయారు చేయడంలో పేరొందిన ధన్‌రాజ్ తెలిపాడు.