శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్

9న తొలి దశ పంచాయతీ పోరుకు సర్వంసిద్ధం...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలి దశ పంచాయతీ ఎన్నికలు మంగళవారం జరగనున్నాయి. ఇందుకోసం అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. విజయవాడ డివిజన్‌లో 14 మండలాల పరిధిలో ఏకగ్రీవాలు పోనూ 211 పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. 
 
511 మంది సర్పంచ్‌ అభ్యర్థులు బరిలో ఉన్నారు. 2,110 వార్డు స్థానాలకు 4,533 మంది అభ్యర్థులు రంగంలో ఉన్నారు. మొత్తం 2,447 పోలింగ్‌ కేంద్రాలను సిద్ధం చేశారు. అన్ని కేంద్రాల్లో ఉదయం 6.30 గంటలకు ఎన్నికలు ప్రారంభమై మధ్యాహ్నం 3.30 గంటల వరకు కొనసాగుతాయి. మొత్తం 7,500 మంది ఉద్యోగులు ఎన్నికల విధుల్లో ఉంటారు. 
 
ఇప్పటికే స్టేజ్‌ 1, 2 రిటర్నింగ్‌ అధికారులు విధినిర్వహణలో ఉండగా, తాజాగా పోలింగ్‌ ఆఫీసర్లు, అదర్‌ పోలింగ్‌ ఆఫీసర్లు, ప్రిసైడింగ్‌ అధికారులను నియమించారు. వీరికి విజయవాడ డివిజన్‌ పరిధిలో రెండు రోజులు శిక్షణ ఇచ్చారు. వీరంతా సోమవారం నుంచి బాధ్యతలు నిర్వహించనున్నారు. 
 
పోలింగ్‌ సిబ్బందికి ఎన్నికల సామగ్రిని అందించనున్నారు. నామినేషన్లకు సంబంధించిన మెటీరియల్‌ను ఇంతకుముందే పంపించారు. ప్రతి పోలింగ్‌ సిబ్బందికి ఒక కిట్‌ ఇస్తారు. ఈ కిట్‌లో పోలింగ్‌లో నిర్వహించాల్సిన అన్ని పనులకు సంబంధించిన వివరాలు అందుబాటులో ఉంటాయి. 
 
ఆయా మండలాల పరిధిలో గ్రామాలకు కలిపి ఒక బస్సును ఏర్పాటు చేస్తున్నారు. ఆ బస్సులో ఎన్నికల సిబ్బంది ఆయా గ్రామాలకు ఒకరోజు ముందే చేరుకుంటారు. పోలింగ్‌ స్టేషన్లకు తీసుకెళ్లే వాహనాల్లోనూ, పోలింగ్‌ కేంద్రాల దగ్గర పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు.