మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 21 మే 2020 (14:47 IST)

కంటైన్మెంట్ ప్రాంతాల్లో మినహా మిగిలి చోట్ల... కండిషన్స్ అప్లై

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి ఏమాత్రం తగ్గడం లేదు. ఈ రాష్ట్రంలో ప్రతి రోజూ పదుల సంఖ్యలోనే కేసులు నమోదవుతున్నాయి. అయినప్పటికీ ప్రభుత్వం మాత్రం అన్ని రకాల సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు సిద్ధమవుతోంది. ముఖ్యంగా, కంటైన్మెంట్ ఏరియాల్లో మినహా మిగిలిన అన్ని ప్రాంతాల్లో షాపులు తెరుచుకునేందుకు అనుమతినిచ్చింది. అయితే, పలు కండిషన్లను పెట్టింది. నిబంధనల మేరకు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు మాత్రమే షాపులు తెరిచివుంచాలి. ఇదే అంశంపై ప్రభుత్వం ఒక జీవోను జారీచేసింది. అందులో పేర్కొన్న అంశాలను పరిశీలిస్తే, 
 
* సంస్థలు, దుకాణాలు, షాపులు మాత్రం ఉదయం 7 నుంచి రాత్రి 7 వరకు తెరిచి ఉంచుకోవచ్చు. 
* మెడికల్ షాపులు మాత్రం రాత్రి 8 లేదా 9 వరకు తెరిచి ఉంచొచ్చు. 
* వస్త్ర, పాదరక్షలు, ఆభరణాల షాపులకు మాత్రం అనుమతి ఇవ్వలేదు. 
* హోటళ్లు, రెస్టారెంట్లకు అనుమతి లేదు. అయితే, టేక్ అవే, హోం డెలివరీలు చేసుకోవచ్చు.
* షాపులు, సంస్థలు, దుకాణాల్లో పని చేసే సిబ్బంది మాత్రం ఖచ్చితంగా చేతులను శానిటైజ్ చేసుకోవాలి. ముఖానికి మాస్కులు ఖచ్చితంగా ధరించాలి.
* మొత్తం సిబ్బందిలో 50 శాతం మంది మాత్రమే పని చేయాలి.
* ఎంట్రీ, ఎగ్జిట్ మార్గాలతో పాటు.. లిఫ్టులు, వర్కింగ్, పార్కింగ్ ప్రదేశాలను ఉదయం, సాయంత్రం శానిటైజ్ చేయాలి.
* మరుగుదొడ్లను గంటకు ఒకసారి శుభ్రం చేయాలి. సిబ్బందికి శానిటైజర్లు, టిష్యూ పేపర్లు ఉండేలా చూసుకోవాలి.
* నిర్వాహకులు, సిబ్బంది ఆరోగ్యసేతు యాప్‌ను విధిగా డౌన్ లోడు చేసేలా చర్యలు తీసుకోవాలి. ఇలాగే, పలు నిబంధనలతో కూడిన జీవోను జారీచేసింది.