1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 2 ఫిబ్రవరి 2021 (12:59 IST)

టీడీపీ నేత పట్టాభి ఇంటిపై దాడి.. మంత్రి కొడాలి నాని హస్తం???

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాడుల సంస్కృతి పెరిగిపోతోంది. ఇప్పటికే పంచాయతీ ఎన్నికల్లో వైకాపా శ్రేణులు ఇష్టారాజ్యంగా రెచ్చిపోతున్నాయి. విపక్ష పార్టీలకు చెందిన నేతలపై దాడులకు పాల్పడుతున్నాయి. ఈ క్రమంలో తెదేపా జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిపై దాడి జరిగింది. ఆయన ఇంటి దగ్గరే దుండగులు దాడి చేశారు. 
 
కొందరు వ్యక్తులు కారు‌ను చుట్టుముట్టి రాడ్‌తో దాడి చేయగా కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. పట్టాభికి తీవ్ర గాయాలయ్యాయి. ఆయన సెల్‌ఫోన్ కూడా ఈ దాడిలో ధ్వసమైంది. ఈ దాడి తర్వాత పట్టాభిని ఆస్పత్రికి తరలించనున్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమా మహేశ్వర్‌రావు అక్కడకు చేరుకుని పట్టాభిని పరామర్శించారు. 
 
ఈ దాడిపై పట్టాభి మీడియాతో మాట్లాడుతూ, ఉదయం కార్యాలయానికి బయలుదేరే సమయంలో ఇంటికి దగ్గరలోనే దాదాపు 10 మంది కాపుగాసి, ఒక్కసారిగా కారును చుట్టుముట్టి రాడ్లు, కర్రలు, బండరాళ్లతో దాడులు చేశారని తెలిపారు. 
 
తనపై దాడి చేశారని, కారును పూర్తిగా ధ్వంసం చేశారని చెప్పారు. డ్రైవర్‌పై కూడా దాడి చేసినట్లు ఆయన పేర్కొన్నారు. గతంలో కూడా తన వాహనాన్ని కొందరు వ్యక్తులు ధ్వంసం చేశారని ఈ సందర్భంగా పట్టాభి గుర్తుచేశారు. ఇలాంటి దాడులకు తాను భయపడేది లేదని, వాస్తవాలను బయటపెట్టేందుకు వెనకడుగు వేసేది లేదని స్పష్టం చేశారు.
 
కాగా, ప్రభుత్వంలో జరుగుతున్న కుంభకోణాలను బయటపెడుతున్నందుకే తనను టార్గెట్ చేశారని ఆరోపించారు. గత పదిరోజులుగా తనకు బెదిరింపులు వస్తున్నాయన్నాయన్నారు. ఈ విషయాన్ని మీడియా ముఖంగా పోలీసులకు తెలియజేశానని తెలిపారు. 
 
తనకు రక్షణ కల్పించాలని కోరానని... అయినప్పటికీ పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. మంత్రులు, హైకోర్టులు జడ్జి‌లు, ప్రముఖులు ఉండే ఇలాంటి ప్రాంతంలో మారుణాయుధాలతో దాడులు జరుగుతుంటే రాష్ట్రంలో శాంతిభద్రలు ఏ విధంగా ఉన్నాయో ప్రజలు ఆలోచించుకోవాలన్నారు. 
 
పోలీస్ వ్యవస్థ పూర్తిగా అధికార పార్టీకి సరెండర్ అయిపోయి, ప్రతిపక్ష పార్టీలపై దాడులు జరుగుతుంటే నిమ్మకు నీరెత్తినట్లుగా ఉంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘నాపై ఎన్ని దాడులకు పాల్పడినా... నా నోరు మూయించడం మీ వల్ల కాదు’’ అని పట్టాభి స్పష్టం చేశారు. అన్నారు. ఈ దాడికి వెనుక మంత్రి కొడాలి నాని పాత్ర ఉందని ఆరోపించారు.