1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 21 జనవరి 2020 (08:15 IST)

ఉగాదికే రాజధాని తరలింపు?

మూడు రాజధానుల బిల్లును ఆమోదించుకున్న వైసీపీ ప్రభుత్వం.. దాని కార్యాచరణకు చకచకా అడుగులేస్తోందా?.. ఆమేరకు అమరావతిని వీడేందుకు ఏర్పాట్లు ముమ్మరం చేసిందా?.. అవుననే అంటున్నాయి ప్రభుత్వ వర్గాలు.

అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ఉగాది నాటికి విశాఖకు తరలిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఐటీ శాఖకు ప్రభుత్వం మౌఖిక ఆదేశాలు జారీ చేసింది. విశాఖ వెళ్లి అక్కడ ఉద్యోగులకు అవసరమైన సాంకేతికపరమైన అంశాలను చూడాలని ఆదేశించింది.

మిలీనియం టవర్‌, ఆయా శాఖలు చూసి మిగతా భవనాలకు సంబంధించి కేబుల్స్‌, సాఫ్ట్‌వేర్‌, ఆన్‌లైన్‌ సౌకర్యం చూడాలని ఆదేశాల్లో పేర్కొంది. హెచ్‌వోడీ కార్యాలయం, సచివాలయం ఉద్యోగులు వచ్చిన వెంటనే పని చేసే విధంగా సౌకర్యాలు ఉండాలని సూచించింది. ప్లగ్‌ అండ్‌ ప్లేగా ఉండాలని ఆదేశించింది.

ఉగాది తర్వాత నుంచి తరలింపు ప్రక్రియను ప్రారంభించాలని నిర్ణయించింది. దీంతో హెచ్‌వోడీలు, సచివాలయం, రాజ్‌భవన్‌, ఇతర కార్యాలయాలన్నింటినీ తరలించేందుకు అధికారులు షెడ్యూల్‌ ఖరారు చేస్తున్నారు. ఏప్రిల్‌ 16వ తేదీ నాటికి తరలింపు ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులు నిర్ణయించారు.

ఆయా హెచ్‌వోడీ కార్యాలయాలకు భవనాలు చూసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. సీఎంవో కార్యాలయాన్ని కూడా వెంటనే తరలించాలని భావిస్తున్నారు. మార్చి 25వ తేదీలోపు కీలక శాఖలకు చెందిన కొంతమంది ఉద్యోగులను ఆన్‌డ్యూటీ పద్ధతిలో విశాఖకు పంపించాలని ప్రభుత్వం భావిస్తోంది.