శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 20 జనవరి 2020 (13:23 IST)

40 ఏళ్ల కుర్రాడి దెబ్బకు చంద్రబాబు అడుక్కు తింటున్నాడు: రోజా

టీడీపీ అధినేత చంద్రబాబు రాష్ట్రంలోని అన్ని గ్రామాలకు విపక్షనేతనా.. లేదంటే 29 గ్రామాలకు మాత్రమే విపక్ష నేతనా? అంటూ ఎమ్మెల్యే రోజా విమర్శించారు. నేడు ఆమె మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ, చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కూకట్‌పల్లి నుంచి మహిళలను తీసుకొచ్చి నిరసనలు చేయిస్తున్నారని ఆరోపించారు. తల్లి తన బిడ్డలను సమానంగా చూసినట్లుగానే.. జగన్‌ మూడు ప్రాంతాల అభివృద్ధికి కృషి చేస్తున్నారన్నారు.
 
 
పదేళ్లు ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్‌ నుంచి ఎందుకొచ్చారని రోజా ప్రశ్నించారు. అమరావతిలో ఒక్క శాశ్వత భవనమైనా నిర్మించారా? అని నిలదీశారు. ఏ అనుభవం ఉందని నారాయణ అధ్యక్షతన కమిటీ వేశారని రోజా ప్రశ్నించారు. అసెంబ్లీలో 151 మంది ఎమ్మెల్యేలకు రెండు బాత్‌రూమ్‌లేనా? అని రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ఎన్నో ప్రలోభాలు పెట్టినా.. తడిగుడ్డలో చెప్పు పెట్టి కొట్టినట్టుగా ప్రజలు ఓడించారని రోజా పేర్కొన్నారు.
 
 
40 ఏళ్ల కుర్రాడు వేసిన దెబ్బకు.. చంద్రబాబు జోలె పట్టి అడుక్కుతింటున్నాడని ఎద్దేవా చేశారు. ప్రజా సమస్యలపై చంద్రబాబు ఏనాడైనా జోలె పట్టారా? అని రోజా ప్రశ్నించారు. ఐదేళ్ల పాటు మహిళలు ఎన్నో బాధలు పడినప్పుడు.. ఈ మహిళలు ఎందుకు బయటకు రాలేదని ప్రశ్నించారు. చంద్రబాబు ప్రభుత్వం ఆడదానికి రక్షణ కల్పించలేదని రోజా విమర్శించారు.