శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 2 జనవరి 2020 (19:39 IST)

నేను రాజీనామా చేయలేదు: టీడీపీకి ఎమ్మెల్యే మద్దాల గిరి

టీడీపీ ఎమ్మెల్యే మద్దాల గిరి వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి. ఆయన వ్యవహారం రోజురోజుకూ ముదురుతోంది. ఇప్పటికే సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిపై ప్రశంసల వర్షం కురిపించి హాట్ టాపిక్ అయిన ఆయన.. తాజాగా టీడీపీపై విమర్శలు, ప్రశ్నల వర్షం కురిపించడం చర్చనీయాంశమైంది.

‘నాలుగైదు నెలలుగా టీడీపీలో అనేక మార్పులు చేయాలని అధిష్టానానికి చెబుతున్నా పట్టించుకోలేదు. ఇప్పటికైనా ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఇదే వైఖరి కొనసాగితే పార్టీ వీడటానికి నా లాంటి వాళ్లు ఎంతో మంది ఉన్నారు. అమరావతికి వ్యతిరేకంగా నలుగురు ఎమ్మెల్యేలు మాట్లాడితే వారిపై చర్యలు ఎందుకు తీసుకోలేదు..?’ అని టీడీపీ పెద్దలకు ఆ పార్టీ ఎమ్మెల్యే మద్దాల గిరి సూటి ప్రశ్న సంధించారు.

కాగా.. మద్దాల వ్యాఖ్యలు టీడీపీలో హాట్ టాపిక్ అయ్యాయి. సీఎం వైఎస్ జగన్‌ను కలిసిన వ్యవహారంపై ఎమ్మెల్యే స్పందిస్తూ.. తాను గుంటూరులో యూజీడీ పనుల నిధులు విడుదల చేయాలని సీఎంని కలిశానన్నారు. తనతో వివరణ తీసుకోకుండానే నియోజకవర్గ ఇంఛార్జ్ నియమించడం బాధాకరమన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు తాను బహిరంగ లేఖ రాస్తున్నానన్నారు.

‘టీడీపీ ఒక సామాజిక వర్గానికే పెద్ద పీట వేసింది. గుంటూరు జిల్లాలో ఒకే సామాజిక వర్గానికి చెందిన తొమ్మిది మందికి టికెట్లు ఇచ్చారు. నా కోసం సీఎంని కలవలేదు. ప్రజా సమస్యల పరిష్కారం కోసమే వెళ్ళాను.

నేను టీడీపీకి రాజీనామా చేయలేదు. గన్నవరం వంశీ నియోజకవర్గంలో ఎందుకు ఇంఛార్జ్ నియమించలేదు..?. బాపట్ల, సత్తెనపల్లిలో కూడా ఇంఛార్జ్‌లు నియమించలేదు’ అని అధిష్టానంపై టీడీపీ ఎమ్మెల్యే ప్రశ్నల వర్షం కురిపించారు.