1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 26 జులై 2022 (14:21 IST)

అప్పు పుట్టిన ప్రతి చోటా అప్పు చేస్తున్న ఆంధ్రప్రదేశ్

andhra pradesh map
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చేస్తున్న అప్పులపై కేంద్రం ఓ క్లారిటీ ఇచ్చింది. లోక్‌సభలో కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం ఓ ప్రకటన చేశారు. ఇందులో తమిళనాడు అప్పుల్లో అగ్రస్థానంలో ఉంది. అయితే, ఏపీ ప్రభుత్వం ఎనిమిదో స్థానంలో ఉన్నప్పటికీ గత మూడు నెలల్లో ఎడాపెడా అప్పులు చేస్తుంది. 
 
ముఖ్యంగా, అప్పు పుట్టిన ప్రతిచోటా.. అందినకాడికి ఎడాపెడా రుణాలు తీసుకుంటున్నట్లు కేంద్రం స్పష్టంచేసింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో అనుమతి ఇచ్చిన అప్పుల్లో మూడు నెలల్లోనే సగానికి పైగా రుణాలు తీసుకున్నట్లు తేలింది. 
 
రాష్ట్ర ప్రభుత్వ అప్పుల చిట్టాను కేంద్రం మరోసారి బయటపెట్టింది. రాష్ట్రం చేసిన అప్పుల గురించి.. తెలుగుదేశం ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్ధిక శాఖ సహాయమంత్రి పంకజ్ చౌదరి లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. 
 
202‌2-23 ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్‌కు నికర రుణ పరిమితి కింద.. 44 వేల 574 కోట్ల రూపాయలు రుణం తీసుకునేందుకు కేంద్రం అనుమతించిందని వివరించారు. మొదటి 9 నెలలకు 40వేల 803 కోట్ల రూపాయలు రుణం తీసుకునేందుకు అనుమతించగా.. తొలి మూడు నెలల్లోనే 50 శాతానికి పైగా రుణాలు తీసుకున్నట్లు చెప్పారు. 
 
ఏప్రిల్ వరకే... బహిరంగ మార్కెట్ నుంచి 21 వేల 890 కోట్ల రూపాయలు, కేంద్రం నుంచి మరో 13 వందల 73 కోట్ల 47 లక్షలు రుణం తీసుకున్న కేంద్రమంత్రి పేర్కొన్నారు. నాబార్డ్ నుంచి 40 కోట్ల 17 లక్షలు రుణం తీసుకుందని కేంద్ర ఆర్ధికశాఖ సహాయమంత్రి పంకజ్ చౌదరి లిఖితపూర్వకంగా వెల్లడించారు.