1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: శనివారం, 3 నవంబరు 2018 (20:48 IST)

ఎపి డిజిపికి వరుస సవాళ్లు...

ఎపి డిజిపి ఆర్.పి.ఠాగూర్ సవాళ్ళతో సావాసం చేస్తున్నారు. ఆయన ఆ సీట్లో వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు డిజిపికి కొత్త సవాళ్ళను విసురుతున్నాయి. వరుస ఘటనలతో పోలీస్ బాస్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. 
 
అనేక వడపోతల తరువాత నాలుగు నెలల క్రితం ఎపి డిపిజిగా ఆర్.పి.ఠాగూర్ ను ప్రభుత్వం నియమించింది. అప్పటి నుంచి డిజిపికి కంటి మీద కునుకులేదు. బాధ్యతలు చేపట్టి నప్పటి నుంచి ప్రభుత్వంతో పాటు డిజిపికి తలనొప్పిగా మారింది. జరుగుతున్న వరుస ఘటనలకు వెంటనే స్పందిస్తున్నా ఏదో ఒక రూపంలో సమస్య వచ్చి పడుతూనే ఉంది. 
 
అనంతలో ప్రబోధానంద ఆశ్రమం.. పోలీసులు, ఎంపి జె.సి.దివాకర్ రెడ్డి మధ్య జరిగిన మాటల యుద్ధం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అలాగే విశాఖలో టిడిపి ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేల హత్యలు, ఆ తరువాత జరిగిన పరిణామాలు ఇదంతా డిజిపిని ఇబ్బందుల్లోకి నెట్టాయి.
 
ఇదిలా ఉండగానే ఎపి ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డిపై దాడి. గోరుచుట్టుపై రోకటి పోటు అన్నట్లు డిజిపి పరిస్థితి మారింది. ఒక్కసారిగా రాజకీయ వేడి రాజుకుంది. జగన్ పైన దాడి జరిగిన తరువాత డిజిపి మాట్లాడిన తీరును వైసిపి నేతలు తప్పుబట్టారు. జగన్ పైన దాడి చేసిన తరువాత పోలీసులు వేగంగా స్పందించి ఉంటే బాగుండేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇలా నాలుగు నెలల కాలంలో డిజిపి అనేక సవాళ్ళను ఎదుర్కొంటూ ముందుకు వెళుతున్నారు.