శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : సోమవారం, 21 నవంబరు 2022 (12:16 IST)

పాలకులు రాక్షసులైతే ఫలితాలు ఇలానే ఉంటాయి.. చంద్రబాబు

chandrababu
పాలకులు రాక్షసులైతే ఫలితాలు ఎలా ఉంటాయో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే ఓ మంచి ఉదాహరణ అని టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. 
 
జాకీ బ్రాండ్ దుస్తుల తయారీ సంస్థ పేజ్ ఇండస్ట్రీస్ ఏపీని వదిలివేసి తెలంగాణా రాష్ట్రానికి వెళ్లిపోయింది. ఏపీలో పరిశ్రమను నెలకొల్పే ఆలోచనను విరమించుకుంది. పైగా, ఈ కంపెనీకి గత టీడీపీ ప్రభుత్వం కేటాయించిన భూమిని కూడా తిరిగి వెనక్కి ఇచ్చేసింది. అదేసమయంలో తెలంగాణాలో రెండు యూనిట్లను ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. 
 
ఈ పరిశ్రమ వెనక్కి వెళ్లిపోవడంపై చంద్రబాబు నాయుడు ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. పాలకులు రాక్షసులైతే ఫలితాలు ఎలా ఉంటాయో మన రాష్ట్రమే ఉదాహరణ అని అన్నారు. 
 
రాయలసీమలో తాను తెచ్చిన పరిశ్రమలు నేడు ఎందుకు వెళ్లిపోయాయి? పెట్టుబడులు తరిమేసింది ఎవరు? సీమ ద్రోహులు ఎవరు? సీమకు పరిశ్రమలు తెచ్చిన మేమా లేక కాసులకు కక్కుర్తిపడి కంపెనీలను వెళ్లగొట్టిన మీరా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. అంతేకాకుండా, నేతలను మేపలేక జాకీ పరార్ అంటూ ఓ పత్రిక ప్రచురించిన కథనాన్ని కూడా ఆయన ట్యాగ్ చేశారు.