1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 21 జనవరి 2022 (09:02 IST)

ఏపీలో జిల్లాకో విమానాశ్రయం : "వన్ డిస్ట్రిక్ట్ - వన్ ఎయిర్‌పోర్ట్"పై సీఎం జగన్ రివ్యూ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లాకో విమానాశ్రయం ఏర్పాటుకానుంది. ఇదే అంశంపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమీక్ష చేశారు. గురువారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో పోర్టులు, విమానాశ్రయ ప్రాజెక్టులపై ఉన్నతాధికారులతో సమీక్ష చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వన్ డిస్ట్రిక్ట్ - వన్ ఎయిర్‌పోర్టు అనే కాన్సెప్టుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆయన ఆదేశించారు. 
 
అన్ని జిల్లాల్లో ఒకే తరహాలో విమానాశ్రయాల నిర్మాణం చేపట్టాలని, ఇందుకు అవసరమైన సౌకర్యాల అభివృద్ధిపై దృష్టిసారించాలని ఆయన అధికారులను కోరారు. ముఖ్యంగా బోయింగ్ విమానాలు ల్యాండ్ అయ్యేలా రన్‌వేలు నిర్వహించాలని కోరారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న ఆరు విమానాశ్రయాలను విస్తరించి మరింతగా మెరుగుపరచాలని కోరారు. 
 
విజయనగరం జిల్లాలోని భోగాపురం విమానాశ్రయం, నెల్లూరు జిల్లాలోని దగదర్తి విమానాశ్రయాలను వీలైనంత త్వరగా నిర్మించాలని స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. అలాగే, రాష్ట్రంలో కొత్తగా నిర్మించిన తొమ్మిది ఫిషింగ్ హార్బర్లు, మూడు ఓడరేవులకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ వాటి అభివృద్ధికి మరింతగా కృషి చేయాలని ఆయన కోరారు.