1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 20 జనవరి 2022 (16:48 IST)

వైఎస్ జగన్‏కు కైకాల సత్యనారాయణ లేఖ

ఏపీ సీఎం వైఎస్ జగన్‏కు సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ లేఖ రాశారు. తాను అనారోగ్యంతో బాధ పడుతున్న సమయంలో జగన్ ప్రభుత్వం చూపిన చొరవపై రియాక్ట్ అయ్యారు. గత నవంబర్ నెలలో తీవ్ర అనారోగ్యానికి గురైన కైకాల.. జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. 
 
ఆ సమయంలో వైద్యానికి సంబంధించిన అన్ని ఖర్చులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భరిస్తుందని ముఖ్యమంత్రి జగన్ భరోసా ఇచ్చారు. ఎప్పటికప్పుడు కైకాల ఆరోగ్యం గురించి ఆరా దీశారు.
 
అయితే అనారోగ్యం నుంచి కోలుకున్న కైకాల సత్యనారాయణ సీఎం జగన్‏కు ఓ లేఖ రాస్తూ.. తన అనారోగ్య సమయంలో సాయం అందించి ప్రత్యేక శ్రద్ధ చూపించడం హర్షమని చెప్పారు. 
 
ఎంత బిజీ షెడ్యూల్లో ఉన్నప్పటికీ వ్యక్తిగతంగా తన బాగోగులు తెలుసుకోవడం, ప్రభుత్వం తరఫున సహాయ సహకారాలను అందిస్తామని హామీ ఇవ్వడం, మీరు హామీ ఇచ్చినట్టుగానే మీ ఉన్నతాధికారులు వ్యక్తిగతంగా సాయం అందించడం ఆనందంగా ఉందని కైకాల చెప్పారు. 
 
కష్ట సమయంలో మీరు అందించిన సహాయం తనకు, తన కుటుంబానికి ఎంతో శక్తినిచ్చిందని కైకాల తన లేఖలో పేర్కొన్నారు. అలాగే తన అనారోగ్య సమయంలో సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.