బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 3 ఏప్రియల్ 2020 (11:10 IST)

ఏపీలో 161కి చేరిన కరోనా కేసులు.. విజయవాడలో తొలి కరోనా మృతి

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతుంది. ఏపీలో శుక్రవారం 12 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనాయి. ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో ఏకంగా 8 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. కరోనా సోకిన వారందరూ ఢిల్లీకి వెళ్లొచ్చిన వారేనని అధికారులు గుర్తించారు.  కృష్ణా జిల్లాలో 23, గుంటూరు లో 20 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.
 
మొత్తం నెల్లూరు లో 32 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో ఇప్పటి వరకు కరోనా కేసులు ఏపీలో 161కు వెళ్లాయి. 14 కేసులకు ఢిల్లీతో లింకులు ఉన్నాయని అధికారులు గుర్తించారు. అత్యధికంగా విజయవాడ నగరంలో 18 కేసులు నమోదు అయ్యాయి. కడపలో ఒక కేసు.. విశాఖలో మూడు కేసులు నమోదు అయ్యాయి.
 
మరోవైపు ఆంధప్రదేశ్‌లో తొలి కరోనా మరణం నమోదైంది. ఇదే విషయాన్ని కేంద్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ తన వెబ్‌సైట్‌లో పేర్కొంది. ఏపీ రాజధాని ప్రాంతమైన విజయవాడలోని భవానీపురం ఏరియాలో ఒకే కుటుంబంలో ఐదుగురికి పాజిటివ్ నమోదు అయ్యింది.
 
ఈ కుటుంబంలోనే ఏకంగా ఐదుగురికి పాజిటివ్ రావడం పెద్ద కలకలం రేపగా ప్రస్తుతం తొలి కరోనా మరణం కూడా అక్కడే సంభవించింది. విజయవాడకు చెందిన ఓ వ్యక్తి ఢిల్లీ జమాతే సభకు వెళ్లి రాగా.. ఆ వ్యక్తి తండ్రి కరోనాతో మృతిచెందాడు. మరణానంతరం పరీక్షలు చేయించగా కరోనా పాజిటివ్‌ అని తేలింది. అనంతరం ఆ కుటుంబంలోని మిగిలిన వారికి కూడా కరోనా సోకింది.