గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: శుక్రవారం, 12 జూన్ 2020 (22:53 IST)

స్వామి కరుణించవా? కుటుంబ సభ్యులతో తిరుపతికి వచ్చి దర్సన టోకెన్లు దొరక్క?

ఈ నెల 11వ తేదీ నుంచి సామాన్య భక్తులకు తిరుమల శ్రీవారి దర్సనం. స్వామివారిని దర్సించుకోండి.. ఇది టిటిడి ప్రకటన. అయితే అదంతా ఎక్కడ. స్వామివారి దర్సన టోకెన్లను నిలిపేశారు. తిరుమలకు పంపడం లేదు. ఆ స్వామి వారిని ఎలా దర్సించుకోవాలంటూ తిరుపతిలో భక్తులు ఆవేదనకు గురయ్యారు.
 
తిరుపతిలోని మూడు ప్రాంతాల్లో.. రైల్వేస్టేషన్ సమీపంలోని విష్ణునివాసం, శ్రీనివాసం, అలిపిరి వద్దనున్న భూదేవి కాంప్లెక్స్‌లలోని 18 కౌంటర్లలో నిన్నటి వరకు దర్సన టోకెన్లను జారీ చేశారు. మొదటి రోజు దర్సన టోకెన్లను ఇచ్చే సమయంలో 10వ తేదీ పెద్ద ఎత్తున భక్తులు టోకెన్ల కోసం బారులు తీరారు.
 
భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో టిటిడి చేసేది లేక 11వ తేదీ నుంచి మూడురోజుల పాటు అంటే 14వ తేదీ వరకు దర్సన టోకెన్లను ఇచ్చింది. ఆ తరువాత మరుసటి రోజు మరో మూడురోజుల పాటు టోకెన్లను జారీ చేసింది. 17వ తేదీ వరకు దర్సన టోకెన్లను ఇచ్చేయడంతో ఇది తెలియని భక్తులు మామూలుగా తిరుపతికి వచ్చేశారు.
 
తిరుపతికి చేరుకున్న భక్తులు టోకెన్లు ఎక్కడ ఇస్తున్నారో తెలుసుకుని అక్కడకు వెళ్ళారు. అయితే టోకెన్ల జారీ ప్రక్రియను నిలిపివేయడంతో కుటుంబంతో సహా వచ్చిన భక్తులు రోడ్డుపై పడిగాపులు కాస్తున్నారు. దర్సనభాగ్యం కల్పించండి స్వామి అంటూ టిటిడి సెక్యూరిటీని వేడుకొంటున్నారు. అయితే 17వ తేదీ తరువాతే టోకెన్ల కోసం రావాలని టిటిడి సెక్యూరిటీ అధికారులు తేల్చిచెప్పినా భక్తులు మాత్రం శ్రీవారిని దర్సించుకున్న తరువాతనే ఇక్కడ నుంచి వెళతామంటూ కౌంటర్ల బయటే కూర్చుండిపోయారు.