1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 11 జూన్ 2020 (11:39 IST)

తిరుమలకు క్యూ కట్టిన భక్తులు.. కనిపించని సామాజిక దూరం!!

కలియుగ వైకుంఠంగా భావించే తిరుమల పుణ్యక్షేత్రానికి భక్తులు క్యూ కట్టారు. కరోనా లాక్డౌన్ కారణంగా ఈ ఆలయంలోకి భక్తుల ప్రవేశాన్ని నిలిపివేశారు. అయితే, కేంద్రం లాక్డౌన్ ఆంక్షలు సడలించడంతో తిరిగి దర్శనం పునఃప్రారంభమైంది. దీంతో భక్తులు ఒక్కసారిగా క్యూకట్టారు. 
 
తమ ఇష్టదైవమైన శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకునేందుకు భక్తులు భారీగా తరలి వస్తున్నారు. దీంతో తిరుపతిలోని అలిపిరిలోని బాలాజీ లింక్ బస్టాండ్, శ్రీనివాసం, విష్ణునివాసం ప్రాంతాల్లో దర్శన సమయ టోకెన్లను జారీ చేయడం మొదలైంది. దీంతో వేల మంది భక్తులు పోటెత్తారు. 
 
స్థానికులు పెద్ద సంఖ్యలో టోకెన్ జారీ కేంద్రాల వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా భక్తులెవరూ భౌతిక దూరం పాటించక పోవడంతో అధికారులు తలపట్టుకున్నారు. అలిపిరి లింక్ బస్టాండులో భక్తులను టీటీడీ సిబ్బంది దూరదూరంగా కూర్చోబెట్టారు. 
 
బుధవారం సాయంత్రానికే ఈ నెల 14 వరకూ 15 వేల టోకెన్లను జారీ చేశారు. మొదట ఒక రోజుకు సరిపడా 3,700 టోకెన్లు ఇవ్వాలని భావించినా, భక్తులు వేల సంఖ్యలో రావడంతో దాదాపు 15 వేలకు పైగా టోకెన్లను జారీ చేశారు. ఇక నేడు మరో మూడు రోజులకు సరిపడినన్ని టోకెన్లు ఇస్తామని అధికారులు తెలిపారు.
 
కాగా, అలిపిరి వద్దకు వచ్చే భక్తుల వద్ద ఉన్న దర్శన సమయం టోకెన్ పరిశీలించి, థర్మల్ స్క్రీనింగ్ నిర్వహించిన తర్వాతనే కొండపైకి అనుమతిస్తున్నారు. తొలి రోజున శరీర ఉష్ణోగ్రత అధికంగా ఉన్న సుమారు 300 మంది భక్తులకు కరోనా పరీక్షలు నిర్వహించారు. టికెట్‌తో పాటే తిరుమలలో గదిని కూడా కేటాయించే సదుపాయాన్ని కల్పించామని అధికారులు తెలిపారు.