శుక్రవారం, 5 జులై 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : బుధవారం, 3 జులై 2024 (16:59 IST)

జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం - విచారణలో కదలిక...

Jagan
మాజీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. జగన్‌పై ఉన్న కేసుల గురించి దాఖలైన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు బుధవారం విచారణ చేపట్టింది. సీబీఐ కోర్టులో ఉన్న జగన్ కేసులను రోజువారీగా విచారించాలని హైకోర్టు ఆదేశాలు జారీచేసిన విషయం తెల్సిందే. దీంతో హైకోర్టు విచారణ చేపట్టింది. 
 
కాగా, జగన్ కేసులపై గతంలో కాంగ్రెస్ సీనియర్ నేత హరిరామజోగయ్య హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై ప్రభుత్వ తరపు న్యాయవాది కోర్టులో వాదనలు వినిపించారు. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతున్నట్టు తెలిపారు. దీనిపై ప్రభుత్వం ఇప్పటికే కౌంటర్ దాఖలు చేసిందని విన్నవించడంతో ఈ కేసు తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. 

భారాస ఎమ్మెల్సీ కె.కవితకు మరోమారు షాక్.. కస్టడీ పొడగింపు!! 
 
భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు కోర్టు మరోమారు షాకిచ్చింది. ఆమెకు జ్యూడీషియల్ కస్టడీని ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు పొడగించింది. ఢిల్లీ మద్యం కేసులో అరెస్టు అయి ఢిల్లీలోని తీహార్ జైలులో ఉంటున్న కవితకు బుధవారం జ్యూడీషియల్ కస్టడీ ముగిసిపోయింది. దీంతో ఆమెను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులు కోర్టు ముందు హాజరుపరిచారు. 
 
ఈ కేసు విచారణనను రౌస్ అవెన్యూ కోర్టు జూలై 25వ తేదీకి వాయిదా వేస్తూ అప్పటివరకు ఆమె కస్టడీని పొడగిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. కాగా, ఢిల్లీ మద్యం కేసులో కవితో పాటు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాలతో పాటు మరికొందరు అరెస్టయి వున్న విషయం తెల్సిందే. ఈ కేసులో తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ కవిత దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్‌లను కింది కోర్టుల నుంచి సుప్రీంకోర్టు వరకు తిరస్కరించిన విషయం తెల్సిందే.