శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 20 ఆగస్టు 2022 (20:19 IST)

జనసేన కౌలు రైతు భరోసా యాత్ర: ప్ర‌జారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయ‌కుంటే...?

Pawan Kalyan
Pawan Kalyan
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి సొంత జిల్లా కడపలో శనివారం పర్యటించారు.  జనసేనాని చేపట్టిన కౌలు రైతు భరోసా యాత్రను ఉమ్మడి కడప జిల్లాలో నిర్వహిస్తున్నారు. ఈ ర‌చ్చబండ‌లోనే బాధిత రైతు కుటుంబాల‌కు రూ.1 ల‌క్ష చొప్పున ఆర్థిక సాయం అందించ‌ంచారు. జిల్లా ప‌రిధిలో ఆత్మహ‌త్యకు పాల్పడ్డ 175మంది కౌలు రైతుల కుటుంబాలకు ప‌వ‌న్ ఈ సాయాన్ని స్వయంగా అందించారు. 
 
ప్ర‌భుత్వం ప‌ట్టించుకోక‌పోవ‌డంతో కౌలు రైతుల‌కు తీవ్ర అన్యాయం జ‌రుగుతోంద‌న్న ప‌వ‌న్‌.. కౌలు రైతుల‌కు క‌నీసం గుర్తింపు కార్డులు కూడా ఇవ్వ‌డం లేద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ప్ర‌జారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయ‌కుంటే... ఏపీకి ఈ రోజు ఈ ప‌రిస్థితి వ‌చ్చేది కాద‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. 
 
కడప జిల్లాలోని సిద్ధవ‌టం మండ‌ల కేంద్రంలో ఏర్పాటు చేసిన ర‌చ్చ‌బండ‌లో ఆయ‌న జిల్లాలో ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డ 173 మంది కౌలు రైతుల కుటుంబాల‌కు రూ.1 ల‌క్ష చొప్పున రూ.1.73 కోట్ల‌ను పంపిణీ చేశారు. అనంత‌రం అక్క‌డే ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌లో ఆయ‌న ప్ర‌సంగించారు. ఈ సందర్భంగా ఏపీలో వైఎస్ జగన్ సర్కారుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 
 
త‌న పోరాటం వ్య‌క్తుల‌పై కాద‌న్న జ‌న‌సేనాని... భావాల‌పైనే తాను పోరాటం చేస్తాన‌ని తెలిపారు. 2014లో మార్పు కోసం బ‌య‌ట‌కు వ‌చ్చాన‌న్న ప‌వ‌న్‌... తానేదో 9 నెల‌ల్లోనే అధికారం చేజిక్కించుకుంటాన‌ని పార్టీ పెట్ట‌లేద‌ని తెలిపారు. వార‌స‌త్వ రాజ‌కీయాల‌కు కొంత‌వ‌ర‌కైనా అడ్డుక‌ట్ట ప‌డాల్సిన అవ‌స‌రం ఉంద‌ని ప‌వ‌న్ చెప్పారు. 
 
అన్న ప‌ట్టించుకోలేద‌ని చెల్లి మ‌రో పార్టీ పెట్టింద‌ని ప‌వ‌న్ ఎద్దేవా చేశారు. రాయ‌ల‌సీమ చ‌దువుల నేల అన్న ప‌వ‌న్‌... ప‌ద్యం పుట్టిన నేల‌లో ఇప్పుడు మ‌ద్యం ఏరులై పారుతోంద‌ని విమ‌ర్శించారు. 
 
ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని నేరుగానే టార్గెట్ చేసిన ప‌వ‌న్‌... సొంత బాబాయిని చంపిన వారిని ఇప్ప‌టిదాకా ఎందుకు ప‌ట్టుకోలేద‌ని ప్ర‌శ్నించారు. కోడి క‌త్తితో త‌న‌పై దాడి జ‌రిగితే ఏపీ పోలీసులపై త‌న‌కు న‌మ్మ‌కం లేదంటూ గ‌తంలో జ‌గ‌న్ చేసిన వ్యాఖ్య‌ల‌ను ఈ సంద‌ర్భంగా ప‌వ‌న్ గుర్తు చేశారు. 
Pawan kalyan
Pawan kalyan
 
ఇప్పుడు జ‌గ‌నే సీఎం క‌దా... ఏపీ పోలీసుల‌పై జ‌గ‌న్‌కు ఎందుకు న‌మ్మ‌కం లేద‌ని నిల‌దీశారు. మైదుకూరులో ఓ వికలాంగుడిని వైసీపీ నేతలు బెదిరించడం సిగ్గు చేటు అని అన్నారు. 
 
మైదుకూరుకు చెందిన నాగేంద్రకు జనసేన అండగా ఉంటుందన్నారు. ఇడుపులపాయలో వేల ఎకరాలు జగన్‌కు ఉన్నాయని.. రాయలసీమలో మార్పు జరగాలంటే మార్పులు రావాలని స్పష్టం చేశారు. కేంద్రం మెడలు వంచుతామన్న వైసీపీ ఎంపీలు అక్కడికి వెళ్లి మొకరిల్లుతున్నారని విమర్శించారు పవన్ కళ్యాణ్.