బుధవారం, 17 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : ఆదివారం, 5 జనవరి 2020 (11:15 IST)

ప్రియుడి చేతిలో మోసపోయిన టెక్కీ.. పెళ్లికూతురిలా ముస్తాబై మండపానికి వస్తే?

హైదరాబాద్ టెక్కీ.. ప్రియుడి చేతిలో మోసపోయింది. సహచర ఉద్యోగితో ప్రేమలో పడింది. ఆపై ఏడాది పాటు అతనితో సహజీవనం చేసింది. తర్వాత  పెళ్లికి ప్రియుడిని ఒత్తిడి చేసింది. కల్యాణ మండపం బుక్ చేశానని ప్రియుడి మాటలు నమ్మింది. పెళ్లి సమయానికి రావాలని చెబితే, పెళ్లి కూతురిగా అక్కడికి వెళ్లి, కల్యాణ మండపానికి తాళం వేసుండటాన్ని చూసి అవాక్కైంది. చివరికి తాను దారుణంగా మోసపోయానని తెలుసుకుని పోలీసులను ఆశ్రయించింది. 
 
వివరాల్లోకి వెళితే.. సికింద్రాబాద్‌లో ఉంటున్న బాధితురాలు, ఓ ఎంఎన్సీలో నాలుగేళ్లుగా పనిచేస్తుండగా, మాసబ్ ట్యాంక్‍లో ఉండే ప్రవీణ్, పరిచయం అయ్యాడు. వారి స్నేహం ప్రేమగా మారింది. రెండేళ్ల క్రితం పెళ్లి చేసుకుందామని ప్రవీణ్ చెబితే, నమ్మింది. కులాలు వేరైనా, తన ఫ్యామిలీని ఒప్పిస్తానని నమ్మ బలికితే, సంవత్సరంగా అతనితో సహజీవనం చేసింది.  అతనికి అవసరమైనప్పుడల్లా ఆర్థిక సాయం చేసింది. తర్వాత పెళ్లి చేసుకోమని ఒత్తిడి తెచ్చింది. 
 
అయితే ప్రవీణ్ తల్లిదండ్రులు వివాహానికి అంగీకరించలేదు. నవంబర్‌లో ప్రవీణ్ ఇంటికి వెళ్లిన బాధితురాలు, తనకు అన్యాయం చేయవద్దని ప్రాధేయపడింది. అదే రోజున ఫోన్ చేసిన ప్రవీణ్, పెళ్లికి తన ఫ్యామిలీ అంగీకరించిందని, నవంబర్ 13న హైదరాబాద్ లోని ప్యారడైజ్‌లో పెళ్లికి ఏర్పాట్లు చేస్తున్నానని, అక్కడికి వచ్చేయాలని చెప్పడంతో బాధితురాలు నమ్మింది. పెళ్లి సమయానికి ముస్తాబై, తన కుటుంబీకులు, బంధుమిత్రులు, స్నేహితులతో కలిసి అక్కడికి వెళ్లగా, ఫంక్షన్ హాల్‌కు తాళం వేసివుంది. అక్కడ ఎటువంటి పెళ్లికీ కల్యాణ మండపం బుక్ కాలేదని తెలుసుకుని అభాసుపాలైంది.
 
ప్రవీణ్ ఫోన్ కూడా పనిచేయలేదు. ప్రవీణ్ కనిపించక పోవడంతో పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేయగా, పలు సెక్షన్ల కింద కేసును నమోదు చేసిన సీసీఎస్ పోలీసులు, ప్రవీణ్ ఆచూకీ కోసం గాలిస్తున్నట్టు తెలిపారు.