1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Jupudi Prabhakar Rao comments on Jagan attack case and CBI

కోడికత్తి డ్రామా అందుకే... సీబీఐలో అంతా గుజరాత్ ఏజెంట్లే... జూపూడి

Jupudi Prabhakar Rao
అమరావతి : టీడీపీ ప్రభుత్వాన్ని అస్థిర పరచడానికే వైసీపీ, బీజేపీ నాయకులు కలసి కోడికత్తి డ్రామా ఆడారని ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మన్ జూపూడి ప్రభాకర్ రావు రాజధాని అమరావతిలో విమర్శించారు. రాష్ట్రంలో జరిగిన అన్ని హత్యలకు సీఎం చంద్రబాబునాయుడే  కారణం అని విమర్శించడం ప్రజాస్వామ్యాన్ని అపహాశ్యం చేయడమేనని జూపూడి ధ్వజమెత్తారు. మూడు తరాల నేర చరిత్ర ఎవరిదో అందరికీ తెలసని ఆయన ఎద్దేవా చేశారు. జగన్ నేర చరిత్రపై పలువురు న్యాయమూర్తులు చేసిన వ్యాఖ్యలను జూపూడి ఉటంకించారు.
 
మకిలి అంటిన చేతులతో  చంద్రబాబునాయుడుపై కేసులు వేస్తారా అని 2012లో న్యాయమూర్తి సముద్రాల గోవిందరాజుల వ్యాఖ్యలను జూపూడి గుర్తు చేశారు. తక్కువ వ్యవధిలో రూ. 43 వేల కోట్లు ఎలా సంపాదించారని సుప్రీంకోర్టు న్యాయమూర్తి ప్రశ్నించిన విషయాన్ని కూడా ఆయన గుర్తు చేశారు.  సీబీఐలో అంతా గుజరాత్ ఏజంట్లను నియమించారని, వారి మధ్యే గొడవలు జరిగి వ్యవస్థను సర్వనాశనం చేశారని జూపూడి విమర్శించారు. అమిత్ షా, మోడీ అహంకార ధోరణితోనే టీడీపీ నాయకుల కార్యాలయాలు, ఇళ్లపై దాడులు చేయిస్తున్నారని జూపూడి తప్పుపట్టారు.
 
ప్రభుత్వం, పోలీసుల మద్దతు లేకుండానే ప్రతిపక్షనేత 3000 కి.మీటర్ల పాదయాత్ర చేయగలిగారా అని జూపూడి ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డిపై దాడి జరిగిన ఎయిర్ పోర్టుఎవరి నియంత్రణలో ఉందని ఆయన ప్రశ్నించారు. దాడి జరిగాక రక్తపు మరకల చొక్కా ఎక్కడికిపోయిందని, కోడి కత్తి రెండు, మూడు గంటలు ఎందుకు కనిపించలేదని, దాడి చేసిన వ్యక్తికి వైసీపీ నాయకుడు బొత్సకు ఉన్న సంబంధం ఏమిటని జూపూడి అనుమానం వ్యక్తం చేశారు. కోడికత్తి ఘటనతో వైసీపీ నవ్వుల పాలైందని జూపూడి ఎద్దేవా చేశారు.
 
గవర్నర్ ఢిల్లీ ఏజంటుగా వ్యవహరిస్తున్నారని, వైసీపీ, జనసేనలను కలపాలని ప్రయత్నిస్తున్నారని జూపూడి అభిప్రాయపడ్డారు. గత శుక్రవారం సీబీఐ కోర్టులో జగన్‌కు శిక్ష పడుతుందని, అది తప్పించుకునేందుకే కోడి కత్తి డ్రామాకు తెరతీశారని జూపూడి తెలిపారు. గవర్నర్ వ్యవస్థపై ప్రజాస్వామ్య శక్తులను ఏకం చేసేందుకే సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్లారని ఆయన గుర్తుచేశారు. దాడి జరిగిన వెంటనే ఆగమేఘాల మీద ఢిల్లీ వెళ్లింది వైసీపీ వారేనని, గత ఎన్నికల్లో వైసీపీ వారిని ప్రజలు గెలిపించలేదని... వారిపై కక్షగట్టి, టీడీపీ ప్రభుత్వంపై కుట్ర పన్నారని జూపూడి విమర్శించారు. 
 
చిల్లర నాటకాలతో వారు తీసుకున్న గోతిలోవారే పడ్డారని వైసీపీ వారినుద్దేశించి జూపూడి అన్నారు.  సీఎం చంద్రబాబును విమర్శించే హక్కు బీజేపీ వారికి లేదని, నియంత పోకడలు పోయే వారిని ప్రజలు పాతిపెడతారని జూపూడి విమర్శించారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ప్రజలు పాతిపెట్టారని, వచ్చే ఎన్నికల్లో బీజేపీ వారికి భంగపాటు తప్పదని జూపూడి చెప్పారు. కేసులు మాఫీ కోసం జగన్మోహన్ రెడ్డి బీజేపీ వారితో చేతులు కలిపారని జూపూడి తెలిపారు.
About Writer
సిహెచ్
తర్వాతి కథనం
10 వేల నుంచి 15 వేల వరకు జీతం... విరుపాక్షి బిల్డింగ్‌లో స్కిల్ కనెక్ట్ డ్రైవ్, ఎప్పుుడు?