1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 27 మే 2024 (15:17 IST)

అదృష్టం తగలెయ్య.. ఒకే రోజు రెండు వజ్రాలు లభ్యం.. రైతుకు వజ్రాల పంట!!

diamonds-gold
ఏపీలోని కర్నూలు జిల్లా రైతుకు పొలంలో ఒకే రోజు రెండు వజ్రాలు లభ్యమయ్యాయి. దీంతో ఆ రైతు ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. గత వారం రోజుల్లో ఈ ప్రాంతంలో పది వజ్రాలు లభ్యంకాగా, వాటిని వ్యాపారులు గుట్టుచప్పుడు కాకుండా కొనుగోలు చేశారు. సాధారణంగా తొలకరి వానలకు కర్నూలు జిల్లాలోని పొలాల్లో వజ్రాల పంట పడుతుంది. రాత్రికి రాత్రే రైతులు, కూలీలు లక్షాధికారులైపోతున్నారు. వజ్రాల కోసం గాలిస్తున్న రైతులు, కూలీలపై ఓ కన్నేసి ఉంచుతున్న స్థానిక వ్యాపారులు.. విలువైన వజ్రాలు దొరికిన విషయం బయటకు పొక్కేలోపు బంగారం, డబ్బు ముట్టజెప్పి ఆ వజ్రాన్ని సొంతం చేసుకుంటున్నారు. గత వారం రోజుల్లో పది వజ్రాలు లభ్యంకాగా, వ్యాపారులు భారీ మొత్తాలు చెల్లించి వాటిని కొనుగోలు చేసినట్టు సమాచారం. తాజాగా ఆదివారం ఒక్కరోజే జొన్నగిరిలో రైతు కూలీలకు రెండు వజ్రాలు లభ్యమయ్యాయి. విషయం తెలిసిన గ్రామస్థులతో పాటు చుట్టుపక్కల వాళ్లు, పక్క రాష్ట్రాల నుంచి కూడా జనం వచ్చి పొలాల్లో వజ్రాల వేట సాగిస్తున్నారు. 
 
ఈ నేపథ్యంలో కర్నూలు జిల్లాలోని మదనంతపురం గ్రామానికి చెందిన ఓ రైతుకు ఇటీవల దొరికిన ఓ వజ్రానికి స్థానిక వ్యాపారి ఏకంగా రూ.15 లక్షలు ఇచ్చి కొనుగోలు చేసినట్టు ప్రచారం జరుగుతుంది. తుగ్గలి మండలం జొన్నగిరిలో పొలం పనులు చేస్తున్న కూలీలకు చెరో వజ్రం దొరికింది. ఇందులో ఒకదానికి రూ.6 లక్షలు నగదుతో పాటు 6 తులాల బంగారం ఇచ్చి స్థానిక వ్యాపారి ఒకరు కొనుగోలు చేశారు. రెండో వజ్రాన్ని ఇంకా వేలం వేయలేదు. దానికి సుమారు రూ12 లక్షల వరకు ధర పలకవచ్చని వ్యాపారులు చెబుతున్నారు.