1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 10 ఫిబ్రవరి 2020 (07:41 IST)

పేదల కోసమే భూములు తీసుకుంటున్నాం: మంత్రి అవంతి

టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబుకు దమ్ముంటే విశాఖలోనే మొత్తం రాజధాని పెట్టమని చెప్పమనండని మంత్రి అవంతి శ్రీనివాస్ పేర్కొన్నారు.

ఇవాళ విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన.. విశాఖలో ఉన్న నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయమనండి అని ఒకింత సవాల్ విసిరారు. విశాఖ ప్రజల్ని రెచ్చగొడితే పరిణామాలు వేరేగా ఉంటాయన్నారు.

విశాఖలో ఏ కంపెనీ ప్రతినిధుల్ని అయినా బెదిరించినట్లు నిరూపించండన్నారు. గతంలో ల్యాండ్‌ పూలింగ్‌కి మేం చేస్తున్న ల్యాండ్‌ పూలింగ్‌కి తేడా ఉందన్నారు. పేదల కోసమే మేం భూములు తీసుకుంటున్నామని మంత్రి అవంతి చెప్పుకొచ్చారు.
 
దెయ్యాలు వేదాలు వల్లించినట్లు
విశాఖలో భూ దోపిడీ జరుగుతోందని టీడీపీ నాయకులు చెప్పడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని వైసీపీ నేత కొయ్య ప్రసాద్ రెడ్డి అన్నారు.

ముదపాకలో భూ ఆక్రమణలకు పాల్పడినవారు, ఏజెన్సీలో గంజాయి అక్రమ రవాణా చేసిన టీడీపీ నేతల మాటలు వినే పరిస్థితుల్లో విశాఖ ప్రజలు లేరని అన్నారు. దసపల్లా భూములు దశలవారీగా మింగేసిన టీడీపీ నేతలు ఇప్పుడు వైసీపీ నాయకులపై బురదజల్లుతున్నారని విమర్శించారు.

విశాఖ కేంద్రంగా ఉత్తరాంధ్ర అభివృద్ధికి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ప్రయత్నిస్తుంటే ఓర్వలేక టీడీపీ నాయకులు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. సీఎం జగన్మోహన్ రెడ్డి అర్హులందరికీ కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని అధికారులకు ఆదేశిస్తే.. కార్డులు తీసేస్తున్నారంటూ దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.

ఏపీకి  కేంద్రం నుంచి నిధులు రాలేదని రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి నిలదీసిన విషయం టీడీపీ నాయకులకు తెలియకపోవడం సిగ్గుచేటన్నారు.