1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Updated : సోమవారం, 5 జులై 2021 (15:57 IST)

అమరావతి కోసం దేశంలోని ఎంపీలంద‌రికీ ఐ.కా.స‌. లేఖ‌లు

అమ‌రావ‌తి రాజ‌ధాని రైతులు ఏడాదిన్న‌ర‌గా అలుపెరుగ‌ని పోరాటం చేస్తున్నారు. రాజ‌ధానిని త‌ర‌లించ‌వ‌ద్ద‌ని మొత్తుకుంటున్నారు. ఇక్క‌డ ప్ర‌జాప్ర‌తినిధుల‌ను అడ్డుకోవ‌డమే కాకుండా, ఢిల్లీ స్థాయిలోనూ త‌మ పోరాటాన్ని కొన‌సాగిస్తున్నారు. ఇపుడు తాజాగా, భార‌త‌దేశంలోని ఎంపీలంద‌రికీ లేఖ‌లు రాస్తున్నారు. 
 
ఈ నెల 19 నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభంకానున్న నేపథ్యంలో దేశంలోని ఎంపీలందరికీ అమరావతి రాజ‌ధాని ఐక్య కార్యాచ‌ర‌ణ సమితి లేఖలు రాస్తోంది. 
 
ఆంధ్రప్రదేశ్‌ ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించేందుకు తాము చేస్తున్న ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని అమరావతి ఐకాస ఛైర్మన్‌ జీవీఆర్‌ శాస్త్రి, కన్వీనర్‌ శివారెడ్డి ఈ లేఖల్లో కోరారు. ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణానికి 33 వేల ఎకరాలు ఇచ్చిన 29 వేల మంది రైతుల త్యాగాలను మ‌ర‌వ‌రాదంటున్నారు.   
 
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెచ్చించిన రూ.10 వేల కోట్ల రూపాయల వ్యయం, ఇతర పెట్టుబడులను పరిరక్షించటమే తమ ప్రధాన ధ్యేయమని ఐకాస నేతలు పేర్కొన్నారు. 
 
వైకాపా అధినేత, సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్రభుత్వం మూడు రాజధానుల పేరుతో పరిపాలన రాజధానిని విశాఖకు తరలించే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. దీనికి వ్యతిరేకంగా ఏడాదిన్నర పైగా ఉద్యమం చేస్తున్నా ప‌ట్టించుకోవ‌డం లేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. 
 
ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా అమరావతికి ప్రధాని మోదీ భూమి పూజ చేశారని.. దిల్లీని మించిన ప్రపంచస్థాయి రాజధాని నిర్మాణానికి ఆయన మద్దతు తెలిపార‌ని గుర్తుచేశారు. ల్యాండ్‌ పూలింగ్‌ విధానంలో 29 గ్రామాల ప్రజలు 33 వేల ఎకరాలను రాజధానికి ఇచ్చారని, ఈ విధానానికి ఎంతగానో ప్రశంసలు దక్కాయని తెలిపారు. ఇపుడు రాజ‌ధానిని ఎలా మారుస్తార‌ని ప్ర‌శ్నిస్తూ, ఎంపీలంతా పార్ల‌మెంటులో దీనిపై చ‌ర్చించి, త‌మ‌కు న్యాయం చేయాల‌ని లేఖ‌లు రాస్తున్నారు.