1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 5 మే 2020 (13:47 IST)

కరోనా.. లిక్కర్ కోసం క్యూలైన్లు.. రూ.52వేలకు మద్యం కొనేశాడు..

కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో రెండు రోజుల క్రితం లాక్ డౌన్‌ను మే 17 వ‌ర‌కు పొడిగిస్తూ ఉత్త‌ర్వులిచ్చిన కేంద్ర ప్ర‌భుత్వం.. గ్రీన్, ఆరెంజ్ జోన్ల‌లో అనేక స‌డ‌లింపులు ఇచ్చింది. ఇందులో భాగంగా లిక్క‌ర్ షాపులు కూడా ఓపెన్ చేసేందుకు అనుమతి ఇచ్చింది. దీంతో ప‌లు రాష్ట్రాలు క‌రోనా కేసులు త‌క్కువ‌గా ఉన్న ఏరియాల్లో మ‌ద్యం సేల్స్‌కు అనుమ‌తి ఇచ్చాయి. 
 
దాదాపు 40 రోజుల త‌ర్వాత సోమ‌వారం షాపులు తెరుచుకోవ‌డంతో వంద‌లాది మంది ఒకేసారి లిక్క‌ర్ షాపుల‌కు క్యూలు క‌ట్టారు. దీంతో అనేక రాష్ట్రాల్లో భారీగా లిక్క‌ర్ సేల్స్ జ‌రిగాయి. క‌ర్ణాట‌క‌లో సోమ‌వారం ఒక్క రోజే రికార్డు స్థాయిలో రూ.45 కోట్ల మేర మ‌ద్యం అమ్ముడైంద‌ని ఆ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ వెల్ల‌డించింది.
 
లాక్ డౌన్‌లో దాదాపుగా 40 రోజుల పాటు మ‌ద్యం దొరక్క‌పోయే సరికి నాలుక ఎండిపోయిన‌ట్ల‌యింది. గ్రీన్, రెడ్, ఆరెంజ్ జోన్లలో మద్యంపై ఆంక్షలు సడలించడంతో మద్యం ప్రియుల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. 
 
అయితే ముందస్తు జాగ్రత్తలతో బెంగళూరుకు చెందిన పలువురు భారీ ఎత్తున మద్యాన్ని కొనుగోలు చేసి పెట్టుకుంటున్నారు. మాస్క్ కొనుక్కోమంటే కొనుక్కుంటారో లేదో తెలియదు కానీ లిక్కర్ కొనుగోలుకు ఎగబడుతున్నారు. బెంగళూరుకు చెందిన ఓ వ్యక్తి ఏకంగా రూ.52వేల లిక్కర్ కొన్నాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన బిల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.