1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 2 నవంబరు 2020 (07:08 IST)

17 నెలలైనా రాష్ట్రంలో అభివృద్ధి శూన్యం: ఎంపి కేశినేని నాని

జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి 17 నెలలైనా రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి శూన్యమని, పేదలకు ఒరిగింది ఏమీ లేదని, రోజుకు ఒక స్కీం, సంక్షేమం పేరుతో ప్రచారం మాత్రం పెద్ద ఎత్తున జరుగుతున్నట్లు ఎంపి కేశినేని నాని పేర్కొన్నారు. 
 
కార్మిక నగర్ కొండ ప్రాంతంలో రూ. 9.30 లక్షలు పెట్టి నిర్మించిన మెట్లను ఎంపి కేశినేని నాని, ఎమ్మెల్యే గద్దె రామమోహన్ ప్రారంభించారు. అలాగే ఎంపి కేశినేని నాని కొండ ప్రాంత వాసులు టాయిలెట్సు నిర్మించుకునేందుకు తన నిధుల నుంచి శాసనసభ్యులు గద్దె రామమోహన్ కోరిక మేరకు రూ .7 లక్షలు మంజూరు చేశారు.

ఈ సందర్భంగా కొండ ప్రాంత వాసులు కేశినేని నానికి, గద్దె రామమోహన్ కు ఘనంగా స్వాగతం పలికారు. బాణసంచా, డప్పులతో పెద్ద ఎత్తున పూలు జల్లుకుంటు తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా కేశినేని నాని మాట్లాడుతూ వైకాపా అధికారంలోకి వచ్చిన నాటి నుండి శంఖుస్థాపనలు, కొబ్బరికాయలు కొట్టడం తప్ప ప్రజలకు  చేసింది ఏమి లేదన్నారు.

అమరావతి లేదు, పోలవరం లేదు, నగర అభివృద్ధి లేదు, కనీసం డివిజన్లలో కూడా కనీస సౌకర్యాలు కూడా కల్పించే పరిస్థితి లేదని రాష్ట్రం సర్వనాశనం అయ్యేందుకు సిద్ధంగా ఉందన్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో పేదలు, మహిళలు ఆత్మ గౌరవం కాపాడేందుకు అనేక చోట్ల టాయిలెట్ల నిర్మాణం చేసిందని ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టాయిలెట్ల స్కీంలను రద్దు చేసిందన్నారు. 
 
శాసనసభ్యులు గద్దె రామమోహన్ కోరిక మేరకు కొండ ప్రాంతంలో నివశించే వారి కోసం రూ . 7 లక్షల నిధులు టాయిలట్ల నిర్మాణానికి మంజూరు చేస్తున్నట్లు కేశినేని నాని తెలిపారు. తూర్పు నియోజకవర్గ ప్రజలకు గద్దె రామమోహన్ పై అపార సమ్మకం ఉందని, ఏ అవసరం వచ్చిన ఆయన తన సొంత నిధులతోనో, ఎంపి నిధులతోనో, కేంద్ర ప్రభుత్వ నిధులతోనే సమస్యలను పరిష్కరిస్తారన్నారు.

గద్దె రామమోహన్ తన నియోజకవర్గన్ని తన సొంత ఇంటి కంటే ఎక్కువగా ప్రేమిస్తారని ఇటువంటి శాసనసభ్యుడు దొరకడం నియోజకవర్గ ప్రజల అదృష్టంగా కేశినేని నాని పేర్కొన్నారు.