శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 31 అక్టోబరు 2020 (21:04 IST)

అభివృద్ధికి దిక్సూచిగా రాయల చెరువును రూపుదిద్దుతాం: చెవిరెడ్డి

రాయలసీమలోనే అత్యంత ప్రాధాన్యత కలిగిన  రాయలచెరువును ఈ ప్రాంత అభివృద్ధికి దిక్సూచిగా రూపుదిద్దనున్నట్లు ప్రభుత్వ విప్, తుడా చైర్మెన్, చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం చెవిరెడ్డి, తుడా వీసీ హరికృష్ణ తో కలిసి రాయల చెరువును సందర్శించారు.

ఈ సందర్భంగా చెవిరెడ్డి మాట్లాడుతూ రాయల చెరువు అభివృద్ది చరిత్రలో నిలిచిపోయేలా పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. ఆహ్లాదకర వాతావరణంలో ప్రజలు కుటుంబ సభ్యులతో కలిసి ఉల్లాసంగా గడిపేందుకు అవసరమైన సుందరీకరణ పనుకు చేపట్టనున్నట్లు వివరించారు.

అంతే కాకుండా వాకింగ్ ట్రాక్ తో పాటు భక్తి సంగీత కచేరీ నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. అంతే కాకుండా రాయల చెరువు లో ఐ లాండ్ ప్రాంతంలో అతిథి గృహాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఎంత ఖర్చు అయినా వెనకాడబోయేది లేదని వెల్లడించారు. ఈ ప్రాంత అభివృద్ది ఎమ్మెల్యేగా నా బాధ్యతగా స్వీకరించి అభివృద్ది చేస్తానని తెలిపారు. 

ఇందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందించి త్వరలో పనులు ప్రారంభిస్తామని వివరించారు. పర్యాటక , జలవనరులు, విద్యుత్ శాఖ అధికారులతో చర్చించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో టూరిజం ఈఈ సుబ్రమణ్యం , డీఎం సురేష్ , ఇరిగేషన్ ఇంచార్జ్ ఈఈ వెంకట శివారెడ్డి , ఏఈ సుదీప్ రెడ్డి , ఎంపీడీఓ రాజశేఖర్ రెడ్డి , తహశీల్దార్ మధుసూదనరావు తదితరులు పాల్గొన్నారు.