గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 19 అక్టోబరు 2020 (20:17 IST)

తిరుపతిలో అందుబాటులోకి అవిలాల పార్కు: చెవిరెడ్డి

తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ ప్రజలకు మెరుగైన సౌకర్యాలు, సదుపాయాల కల్పనతో పాటు భూనిధి ఏర్పాటు, ఆర్థికవృద్ది లక్ష్యంగా ఆదర్శవంతంగా ముందుకు సాగేందుకు కార్యాచరణ రూపొందించినట్లు తుడా చైర్మెన్ డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేర్కొన్నారు.

ఈ క్రమంలో అన్ని రాజకీయ పార్టీ ల సలహాలు, సూచనలు స్వీకరించేందుకు ఆదివారం తుడా కార్యాలయంలో చెవిరెడ్డి ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. తుడా పరిధిలో చేపట్టాల్సిన అభివృద్ది పనులు, నెలకొన్న సమస్యలు వంటి తదితరాలపై సుదీర్ఘంగా చర్చించారు.

ఈ సందర్భంగా చెవిరెడ్డి మాట్లాడుతూ.. తుడా పరిధిలో అభివృద్ది పనులను అన్ని రాజకీయ పార్టీ లతో చర్చించి అందరి అభిప్రాయాల ఆమోదం మేరకు   అభివృద్ది పనులు చేపట్టేందుకు సంకల్పించామని చెప్పుకొచ్చారు. ఇప్పటి వరకు తుడా పరిధిలో చేపట్టిన అభివృద్ది పనుల పట్ల రాజకీయ పక్ష నేతలు సంతృప్తి వ్యక్తం చేయడం పట్ల అభినందనలు తెలిపారు.

ఈ సమావేశంలో తుడా వీసీ హరికృష్ణ, సెక్రటరీ లక్ష్మీ తో పాటు రాజకీయ పార్టీ ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ కుమార్ రెడ్డి, బీజేపీ నుంచి భాను ప్రకాష్ రెడ్డి, జనసేన నుంచి కిరణ్ రాయల్, వామపక్ష పార్టీల నుంచి కుమార్ రెడ్డి, జనార్ధన్ రెడ్డి, విశ్వనాథ్, టీడీపీ తదితర రాజకీయ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

తమ అభిప్రాయాలను పంచుకున్నారు.  తుడా పరిధిలో చెవిరెడ్డి చేపట్టిన అభివృద్ధిని కొనియాడుతూ, సమస్యలను అధిగమించేందుకు పలు సూచనలు చేశారు.
 
రాజకీయ పార్టీ సమావేశంలో ఇవి నిర్ణయాలు..
తిరుపతి పరపతి పెంచేలా తుడా పరిధిలో అభివృద్ది కార్యక్రమాలు చేపట్టేందుకు కార్యాచరణ రూపొందించామని చెవిరెడ్డి వెల్లడించారు. మరో మూడు నెలల్లో అవిలాల చెరువులో ఆహ్లాదకర వాతావరణం తో పార్కు అందుబాటులోకి తీసుకొస్తాము.
 
క్రీడలకు దూరమవుతున్న చిన్నారుల్లో క్రీడాశక్తిని పెంపొందించి తద్వారా గొప్ప క్రీడాకారులు గా తీర్చిదిద్దేందుకు 
తుమ్మల గుంట చెరువులో స్పోర్ట్స్ క్లబ్ ఏర్పాటు కు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. ఇవన్నీ దేశ సర్వోన్నత న్యాయస్థానం తీర్పు లోబడి ఉంటాయన్నారు.
 
ప్రజల సౌకర్యం కోసం అన్ని ప్రభుత్వ కార్యాలయాల వద్ద రిసెప్షన్ కేంద్రాలు ఏర్పాటు కు నిర్ణయించామని తెలిపారు. అంతే కాకుండా ఖాళీ స్థలాల్లో పచ్ఛిక అభివృద్ది చేసేందుకు చర్యలు చేపట్టారు. 
 
తిరుపతి అర్బన్, రూరల్ పరిసరాల్లో గోవింద దామం పలు సంఖ్యలో ప్రజల అవసరాలకు అనుగుణంగా  నిర్మాణం చేయాలని నిర్ణయించారు. 
 
గ్రంధాలయాల ఏర్పాటుతో విద్యార్థుల్లో పుస్తక పఠనం పెంపొందించాలని యోచించారు. అన్ని రకాల పుస్తకాలు, పత్రికలు ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. 
 
స్విమ్స్, బర్డ్, ప్రసూతి ఆసుపత్రి, రుయా ఆసుపత్రుల వద్ద పేషంట్ల సౌకర్యార్థం రిసెప్షన్ కౌంటర్ల తో పాటు ఆహ్లాదకర వాతావరణం కల్పించేందుకు చర్యలు చేపట్టేందుకు నిర్ణయించారు. 
 
వేదాంతపురం వద్ద ఉన్న 11 ఎకరాల తుడా స్థలంలో కన్వెన్షన్ హాలు నిర్మాణానికి సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని తుడా వీసీ కి సూచించారు. రాయల చెరువు రోడ్డులోని తూడా స్థలంలో అద్భుతమైన షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టనున్నట్లు వెల్లడించారు.