శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : ఆదివారం, 24 మే 2020 (21:43 IST)

దేవుడంటే మా ప్రభుత్వానికి భయం: చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి

దేవుడంటే మా ప్రభుత్వానికి భక్తి, భయం ఉన్నాయని, మేము ఎన్నటికీ తప్పు చేయమని, ఎవరైనా తప్పు చేసినా అంగీకరించమని టీటీడీ పాలకమండలి సభ్యుడు డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి స్పష్టం చేశారు.

టీటీడీ ప్రస్తుతం విక్రయించాలని నిర్ణయించిన భూముల వేలం ప్రక్రియ కూడా గత ప్రభుత్వం నియమించిన పాలకమండలి తీసుకున్న నిర్ణయమే అని ఆయన చెప్పుకొచ్చారు.  టీటీడీ నిరర్థక భూములను అమ్మాలని నిర్ణయం తీసుకుంది టిడిపి, బీజేపీ సభ్యులున్న పాలకమండలే అని ఆయన చెప్పారు.

ఈ నిర్ణయం తీసుకునేది మీరే.. విమర్శించేది మీరేనా..? అని నిలదీశారు. అన్నీ దేవుడు చూస్తున్నాడని, దేవుణ్ణి సైతం రాజకీయానికి వాడుకుంటే పోతారు.  ఆ తరువాత మీ ఖర్మ అని ఆయన హెచ్చరించారు. చెవిరెడ్డి వ్యాఖ్యలు ఆయన మాటల్లోనే..

"చదలవాడ కృష్ణమూర్తి నేతృత్వంలో అప్పుడు పాలకమండలిని నియమించింది టిడిపి ప్రభుత్వం కాదా..? చదలవాడ నేతృత్వంలోని పాలకమండలి టీటీడీకి సంబంధించిన ఉపయోగంలో లేని, నిర్వహణకు ఇబ్బంది అయిన 50 ఆస్తులను వేలం వేసి విక్రయించేందుకు సబ్ కమిటీని నియమించింది నిజం కాదా..?

ఆ భూములను అమ్మాలని సబ్ కమిటీ నివేదిక ఇవ్వడం, ఆ నివేదికను పాలకమండలి తీర్మానం చేసింది నిజం కాదా..? ఆ సబ్ కమిటీలో బీజేపీ వ్యక్తి భానుప్రకాష్ రెడ్డి, టిడిపి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, ఈనాడు మీడియా సంస్థల ఎండీ కిరణ్ వియ్యపురాలు ఎల్లా సుచరిత సభ్యులు కాదా..? భూములు అమ్మాలని నివేదిక ఇచ్చి ఆ నివేదిక మీరే ఆమోదించినది నిజం కాదా?
 
మీరు తీసుకున్న నిర్ణయాన్ని మేము అమలు చేస్తుంటే మాపై విమర్శలా..? ఇదెక్కడి న్యాయం..? భగవంతుడిని ఇలా రాజకీయం కోసం, ప్రచారం కోసం వాడుకుంటారా.. పాపం కాదా?  దేవుణ్ణి ఇలా రాజకీయాలకు వాడుకుంటే పోతారు. ఇక మీ ఖర్మ. టీటీడీకి సంబంధించిన ఏ అంశం మీద అయినా పాలకమండలికే అధికారం ఉంటుంది. ప్రభుత్వానికి ఏమి సంబంధం..?  విమర్శకులకు తెలియదా..?
 
జీఓ ఎం ఎస్ నెం.311 రెవెన్యూ( ఎండోమెంట్స్ -1) ఏప్రిల్ 9 వ తేదీ 1990 రూల్ 165 చాప్టర్ 22 ప్రకారం టీటీడీ కి ఆ హక్కు ఉంది.  1974 నుంచి 2014 వరకు టీటీడీ నిరర్థక ఆస్తుల అమ్మకం ప్రక్రియ జరిగింది. చంద్రబాబు సీఎం గా ఉన్నప్పుడు కూడా 129 టీటీడీ ఆస్తులు వేలం వేసి రూ.6.39 కోట్లకు అమ్మలేదని, ఇప్పుడు ఆరోపణలు చేస్తున్న వారు చెప్పగలరా..?
 
28-7-2015 తీర్మానం నెంబర్: 84 ప్రకారం సబ్ కమిటీ వేసి, ఆ సబ్ కమిటీ తీర్మానం నెంబర్ 253 తేదీ 30-1-2016 న ఈ భూములను వేలానికి ఆమోదించిన మీరే, మాపైన విమర్శలు చేస్తే ఇదెక్కడి చోద్యం.. ఇదేమి న్యాయం.. ఇది ధర్మమేనా..? గత టిడిపి ప్రభుత్వం నియమించిన పాలకమండలి నిరర్థక ఆస్తులుగా గుర్తించిన 50 ఆస్తులను మేము వేలం వేస్తుంటే మా పై నిందలా.. ఇవన్నీ భగవంతునికి తెలియదా?
 
వైజాగ్ లో దేవాదాయ శాఖ కు చెందిన 234 ఎకరాల భూములు విక్రయించింది చంద్రబాబు ప్రభుత్వం కాదా..? ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా 60 ఎకరాల దేవాదాయ భూమిని అమ్మేసింది మీరు కాదా..? వేల కోట్లు విలువ చేసే సదావర్తి భూములు రూ.50 కోట్లకు వేలం పెట్టింది మీరు కాదా..?
 
విజయవాడలో 40 ఆలయాలు కూలదోసింది మీరు కాదా.. దేవాదాయ భూముల లీజు కాలపరిమితిని 12 నుంచి చట్ట సవరణ చేసి 33 సంవత్సరాలకు పెంచింది మీరు కాదా? తప్పులు చేసింది మీరు.. భగవంతుని భూములు అమ్మకానికి పెట్టింది మీరు.. వీలైనంత వరకు అమ్మేసింది మీరు.. భగవంతుడంటే భక్తి, భయం ఉన్న మా మీద విమర్శలు చేస్తే ఏమనాలి.. ? 
 
ఇక మీరు మారరని భగవంతుడి నిర్ణయానికే వదిలేస్తున్నాము.  మీరు ప్రచారం, స్వార్థ రాజకీయ ప్రయోజనం కోసం చేస్తున్న విమర్శలు మీ విజ్ఞతకే వదిలేస్తున్నాము. సీఎం గా అత్యంత భక్తితో 52 మార్లు శ్రీవారిని దర్శించుకున్న వ్యక్తి వైఎస్ రాజశేఖర్ రెడ్డి.  సుదీర్ఘ పాదయాత్ర అనంతరం  తిరుమలకు పాద యాత్రగా వెళ్లి సాధారణ క్యూ లో దర్శనం చేసుకున్నాక ఇంటికి వెళ్ళింది మా నాయకులు కాదా?
 
శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకుని వెళ్ళాక ప్రమాణ స్వీకారం చేసింది మా నాయకుడు కాదా..*సంకల్పం, ఆలోచన మంచిదైతే అన్ని భగవంతుడే నడిపిస్తాడు అనే ప్రగాఢ  నమ్మకం మా నాయకుడుకి ఉంది.  మా నాయకుడు దేవుణ్ణి నమ్మి పని చేసేవారు. మీ లాగా దేవుణ్ణి రాజకీయానికి వాడుకుని పని చేసేవారు కాదు.  మళ్ళీ మళ్ళీ చెబుతున్నాం.. దేవుడంటే భక్తి ఉంది.. భయం ఉంది.

తప్పులు చేసే దైర్యం మాకు లేదు. ఇంకా రాజకీయాల కోసం అసత్య విమర్శలు చేస్తే ఆ పాపం మీకే"నని చెవిరెడ్డి హెచ్చరించారు.