'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్
మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం "కన్నప్ప". ఈ చిత్రాన్ని సూపర్ స్టార్ రజనీకాంత్ తన కుటుంబ సభ్యులతో వీక్షించారు. ఆదివారం రాత్రి రజనీ కోసం ప్రత్యేకంగా ప్రదర్శించారు. ఈ విషయాన్ని హీరో మంచు విష్ణు తన ఎక్స్ ఖాతాలో వెల్లడించారు. అలాగే, రజనీతో దిగిన ఫోటోను కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ఇదే అంశంపై విష్ణు ట్వీట్ చేస్తూ, 'రజనీకాంత్ అంకుల్ రాత్రి 'కన్నప్ప' చిత్రాన్ని చూశారు. సినిమా చూశాక ఆయన నన్ను ప్రేమగా ఆలింగనం చేసుకున్నారు. తనకు కన్నప్ప సినిమా ఎంతగానో నచ్చిందని నాతో చెప్పారు. ఒక నటుడుగా ఈ క్షణం కోసం నేను 22 యేళ్ళ నుంచి ఎదురు చూస్తున్నా. ఆ పరమశివుడి లీలను మీ అందరికీ చూపించేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నా' అని మంచు విష్ణు పేర్కొన్నారు.