శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం

రాష్ట్ర అభివృద్ధి కోసం మహిళలు బయటకు రండి: అమరావతి మహిళా జెఏసీ పిలుపు

అధికారంలో ఉన్న వారు ప్రజా హక్కులను కాలరాస్తూ, రాజ్యాంగంను తుంగలో తొక్కితే ప్రజలు చూస్తూ ఊరుకోరని పదవులు శాశ్వతం కాదు..వ్యక్తులు శాశ్వతం అని తెలుసుకోవాలని అమరావతి మహిళా జెఏసీ కన్వీనర్  వి.దుర్గా భవాని అన్నారు.

ఈ సందర్భంగా దుర్గా భవానీ అమరావతి ఉద్యమం 300 రోజులకు చేరుకున్న సందర్భంగా మహిళా జెఏసీ ఆధ్వర్యంలో శనివారం, ఆదివారం నిర్వహించే నిరసన కార్యక్రమాల్లో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. ఇకనుండి మా ఆక్రోశం ఏమిటో చూపిస్తామని, పోలీసులు వైసీపీ మీటింగ్ లకు, వైన్ షాపులకు పర్మిషన్లు ఇస్తారు కానీ మాకు కోవిడ్ కారణంగా చూపించడం కరెక్ట్ కాదన్నారు.

కేసులు నమోదు చేస్తే నమోదు చేసుకోండి ? పోలీసులు మేము శాంతియుతంగా చేసే ర్యాలీలకు, మిగతా కార్యక్రమాలకు పర్మిషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. 
 
కో కన్వీనర్ సుంకర పద్మశ్రీ మాట్లాడుతూ సీఎం జగన్ ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టి రాష్ట్రాన్ని మూడు ముక్కలు చేయాలని చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 29 వేలమంది రైతులు వారి భూములను ఇస్తే వారిపై వైసీపీ మంత్రులు, ప్రజాప్రతినిధులు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని మేము స్పష్టంగా లెక్కలు చూపిస్తామంటే తప్పుడు ప్రచారం చేస్తున్నారని వాస్తవాలను తెలుసుకొని మాట్లాడాలని, అధికార మదంతో పేట్రేగపోతున్నారని ఆరోపించారు. అమరావతి ఏకైక రాజధాని అని చెప్పే వరకు మా ఉద్యమం ఉవ్వెత్తున సాగుతోందని అన్నారు. 
 
దళిత మహిళా రైతు సువర్ణ కమల మాట్లాడుతూ కరంపైన భూమిని ప్రభుత్వం అన్ని ఒప్పందాలకు అంగీకారం తెలిపిన తరువాత తాను భూములు ఇవ్వడం జరిగిందన్నారు. నవనగరాలు నిర్మాణం చేస్తామని అగ్రిమెంట్ చేశారని, అప్పట్లో అన్ని పార్టీలు కూడా రాజధానిగా అమరావతికి అంగీకారం తెలిపాయని, కాని ఇప్పుడు అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి మాట మార్చడం బాధాకరం అన్నారు.

భూములు ఇచ్చే రైతులకు ఏమి న్యాయం చేస్తామనిదే ప్రభుత్వం క్లారిటీ ఇవ్వడం లేదని ప్రశ్నించారు. మంత్రులు మాట్లాడే అసభ్యకరమైన వ్యాఖ్యలను వెనుకకు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎస్సీ నియోజకవర్గ పరిధిలో ఉన్న రాజధానిపై సీఎంకు ఎందుకు చిన్న చూపు అని ప్రశ్నించారు. రాష్ట్రంలో దళితులు మీద జరిగే దాడులను ఖండించాలని దళితులకు రక్షణ లేకుండా పోయింది ఆవేదన వ్యక్తం చేశారు.
 
టీడీపీ విజయవాడ పార్లమెంట్ మహిళా అధ్యక్షురాలు చెన్నుపాటి ఉషారాణి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినతర్వాత రాష్ట్రానికి ఎన్ని యూనివర్సిటీలు తీసుకొచ్చారు ? సామాన్య రైతులను మీ ప్రజాప్రతినిధులు ఇష్టానుసారంగా మాట్లాడితే ముఖ్యమంత్రి సైతికబాధ్యతలేదా అని ప్రశ్నించారు. రాష్ట్ర భవిష్యత్ కోసం మహిళలు రోడ్లు పైకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు.ఈ కార్యక్రమంలో మహిళా నాయకురాలు బాడితపద్మ ఇతర జెఏసీ మహిళా నేతలు పాల్గొన్నారు.
 
బి.ఆర్.టి.ఎస్ రోడ్డులోని శారదా కళాశాల నుండి ర్యాలీ ప్రారంభం
విజయవాడలో ఆదివారం ఉదయం 9 గ.లకు రాజకీయపార్టీలు, ప్రజాసంఘాలు అమరావతి మద్దతు దారుల నడుమ బి.ఆర్.టి.ఎస్ రోడ్డులోని శారదా కాలేజ్ వద్ద ప్రారంభం అవుతుందని తెలిపారు. 12 వ తేదీ ( సోమవారం ) ఎమ్మార్వో రెవిన్యూ కార్యాలయంలు ముందు నిరసన కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు.