శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 4 సెప్టెంబరు 2020 (22:30 IST)

నూతన్ నాయుడు అరెస్ట్

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన శిరోముండనం కేసులో సినీ నిర్మాత నూతన్‌నాయుడును పోలీసులు అరెస్ట్ చేశారు. కర్ణాటకలోని ఉడిపిలో నూతన్‌నాయుడిని అరెస్ట్‌ చేసినట్లు విశాఖ సీపీ మనీష్‌ కుమార్‌ సిన్హా వెల్లడించారు.

ఈ కేసు నమోదైన తర్వాతనుంచి నూతన్ నాయుడు పరారీలో ఉన్నాడు, అతడిని కర్ణాటకలోని ఉడిపిలో కాసేపటి క్రితం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముంబైకి పారిపోయేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో పోలీసులకు పట్టుబడ్డాడని సీపీ మనీష్‌కుమార్‌ సిన్హా వెల్లడించారు.

శిరోముండనం కేసులో నూతన్‌ నాయుడు పాత్ర ఉందని తేలిన తరువాతనే అతన్ని అరెస్ట్‌ చేశామన్నారు. దళిత యువకుడి శిరోముండనం కేసులో నూతన్‌నాయుడు భార్య మధుప్రియ సహ ఏడుగురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపామన్నారు కమిషనర్. ఘటన జరిగిన రోజు 6 సెల్‌ఫోన్స్‌ సీజ్ చేశామని నూతన్ భార్య సమక్షంలోనే దళిత యువకుడికి శిరోముండనం జరిగిందని సీపీ వెల్లడించారు.

సీసీ ఫుటేజీతో పాటు కీలక ఆధారాలు సేకరించామని మనీష్‌కుమార్ సిన్హా వెల్లడించారు. తన భార్యను కేసు నుంచి తప్పించడానికి సీనియర్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పీవి రమేష్ పేరిట నూతన్ నాయుడు పలువురు అధికారులకు ఫోన్‌చేసి మోసగించినట్టు పోలీసులు గుర్తించారు.

శిరోమండనం ఘటనకు ముందు వెనుక నూతన్ నాయుడు భార్యతో వీడియో కాల్‌లో మాట్లాడినట్లు తేలింది. దర్యాప్తులో మిగిలిన విషయాలు వెల్లడవుతాయని సీపీ చెప్పారు.