1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎంజీ
Last Updated : శనివారం, 2 అక్టోబరు 2021 (22:46 IST)

పవన్ కళ్యాణ్ ప్రయాణానికి అడుగడుగునా అడ్డంకులు

జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ రాజమండ్రి శ్రమదానం, సభ అడుగడుగునా పోలీసు ఆంక్షల మధ్య జరిగాయి. పోలీసుల మితిమీరిన ప్రవర్తన సర్వత్ర విమర్శల పాలయ్యింది. విమానాశ్రయం నుంచి సభా ప్రాంగణానికి పవన్ కళ్యాణ్ ప్రయాణం సైతం మితిమీరిన ఆంక్షల మధ్య సాగింది.

ఉదయం గం. 10. 30 నిమిషాలకు మధురపూడి విమానాశ్రయానికి చేరుకున్న పవన్ కళ్యాణ్ కి జనసేన నాయకులు, కార్యకర్తలు, వీరమహిళలు ఘనస్వాగతం పలికారు. విమానాశ్రయం వద్దకు భారీ సంఖ్యలో జనసైనికులు చేరుకోవడంతో పెద్ద ఎత్తున మోహరించిన పోలీసులు బారి కేడ్లు అడ్డుగా పెట్టి వారు లోనికి ప్రవేశించకుండా అడ్డుకున్నారు.

అయితే పవన్ కళ్యాణ్ వాహన శ్రేణి బయలుదేరిన వెంటనే బారి  కేడ్లను దాటుకుంటూ, పెద్ద పెట్టున నినాదాలు చేస్తు జనసైనికులు ఆయన వెంట కదిలారు. వేలాది మంది బైకులతోనూ, కాలినడకన పవన్ కళ్యాణ్ ని అనుసరించారు.

అయితే పోలీసులు ఎక్కడికక్కడ వారిని నిలిపివేసే ప్రయత్నం చేశారు. పూర్తిగా వైసీపీ మనుషుల్లా వ్యవహరిస్తూ, అప్రజాస్వామికంగా వ్యవహరించారు. జనసైనికుల్ని అడ్డుకున్న ప్రతి చోట పవన్ కళ్యాణ్ వాహనం పైకి ఎక్కి పోలీసుల వైఖరి పట్ల నిరసన తెలియ చేశారు.

క్వారీ సమీపానికి చేరుకున్న సమయంలో పోలీసుల తీరు పట్ల పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. తనతో పాటు జనసేన శ్రేణులను ముందుకు వదిలే వరకు కదిలేది లేదని భీష్మించారు. పవన్ కళ్యాణ్ వాహనంపై బైఠాయించడంతో పోలీసులు వెనక్కి తగ్గక తప్పలేదు. అయితే పోలీసుల ఓవర్ యాక్షన్ తో ఆయన విమానాశ్రయం నుంచి సభా స్థలికి చేరుకోవడానికి 3 గంటలకు పైగా సమయం పట్టింది.

పోలీసుల వైఖరితో కార్యక్రమం 3 గంటలు ఆలస్యం
రాజమండ్రి శ్రమదానం కార్యక్రమం, సభ ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నం 12 గంటలకే పూర్తి కావాల్సి ఉంది. అయితే పోలీసుల అతి వల్ల ఉదయం గం. 10. 45 నిమిషాలకు ఎయిర్ పోర్టుకు చేరుకున్న పవన్ కళ్యాణ్ సభా ప్రాంగణానికి చేరుకోవడానికి 3 గంటల సమయం పట్టింది.

దీంతో శ్రమదానం కార్యక్రమం, సభ రెండు ఆలస్యం అయ్యాయి. 12 గంటలకు పూర్తవ్వాల్సిన కార్యక్రమం 3 గంటలు ఆలస్యమైంది. దీంతో పుట్టపర్తి వద్ద మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం కావాల్సిన కార్యక్రమం కూడా ఆలస్యమైంది.

సభా స్థలికి సమీపంలో శ్రమదానం
సభ ప్రారంభానికి ముందు హుకుంపేటలో శ్రమదానం కార్యక్రమాన్ని జనసేన పార్టీ అధ్యక్షులు సంప్రదాయ సిద్ధంగా ప్రారంభించారు. బాలాజీ నగర్ వద్ద ఏర్పాటు చేసిన సభా ప్రాంగణానికి సమీపంలో ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రహదారిపై ఉన్న గుంతను కంకరతో పూడ్చారు. పార చేతబూని స్వయంగా గంపలు నింపారు. గంపల్లో నింపిన కంకరను గుంతల్లో వేసి పూడ్చారు.