1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 18 జూన్ 2023 (22:34 IST)

ద్వారంపూడీ... నీకు 'భీమ్లా నాయక్' ట్రీట్మెంట్ తప్పదు : పవన్ కళ్యాణ్

pawan kalyan
కాకినాడ వైకాపా ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి జనసేన పార్టీ అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ బహిరంగ వార్నింగ్ ఇచ్చారు. అదీకూడా.. కాకినాడ అడ్డాలో నిలబడి సిట్టింగ్ ఎమ్మెల్యే ద్వారంపూడిని హెచ్చరించారు. ద్వారంపూడీ గుర్తుపెట్టుకో... నీకు భీమ్లా నాయక్ ట్రీట్మెంట్ ఇస్తానంటూ తొడగొట్టి మరీ హెచ్చరించారు. 
 
జనసేనాని వారాహి విజయ యాత్రను చేపట్టిన విషయం తెల్సిందే. ఈ యాత్రలో భాగంగా, ఆదివారం కాకినాడలో బహిరంగ సభను నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక వైకాపా ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. ముఖ్యమంత్రి అండ చూసుకుని ద్వారంపూడి అడ్డుగోలుగా దోపిడీకి పాల్పడుతున్నారని ఆరోపించరు. ద్వారంపూడి వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే గోదావరి జిల్లాలకు తానే ముఖ్యమంత్రిని అన్నట్టుగా ఉందని విమర్శించారు. 
 
ద్వారంపూడీ గుర్తుపెట్టుకో.. నీ పతనం మొదలైంది. నీ క్రిమినల్ సామ్రాజ్యాన్ని కూలదోయకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు.. మా పార్టీ జనసేన కాదు అంటూ పవన్ తొడకొట్టిమరీ చెప్పారు. ఒళ్లు పొగరెక్కి కొట్టుకుంటున్నావా.. మారేందుకు ఓ ఛాన్స్ ఇస్తున్నా.. మారకపోతే ఎస్పీ టీటీ నాయక్ మీ తాతకు బేడీలు వేసి లాక్కెళ్లినట్టు నీక్కూడా భీమ్లా నాయక్ ట్రీట్మెంట్ ఇస్తానంటూ హెచ్చరించారు. 
 
పైగా, ద్వారంపుడిని తాను ఏక వచనంతో సంబోధించడానికి కారణం ఉందన్నారు. రెండున్నర సంవత్సరాల కిందట ఈ స్థానిక ఎమ్మెల్యే గెలిచిన మత్తులో బాగా తాగి అహంకారంతో నోటికి వచ్చినట్టు మాట్లాడాడు. అకారణంగా నన్ను బూతులు తిట్టావ్.. జనసేన నేతలు, వీరమహిళలు, జనసైనికులు ద్వారంపూడి ఇంటి వద్ద నిరసన తెలిపేందుకు వెళ్లారు. అక్కడ ఎమ్మెల్యే రౌడీ మూకలు మావాళ్లపై దాడులు చేశారు. ఆ రోజు నేను ఒక్క మాట అనుంటే ఈ డెకాయిట్ చంద్రశేఖర్ రెడ్డి ఉండేవాడు కాదు. క్రైమ్‌కు పాల్పడేవాడు ఏ కులమైనా వదిలేది లేదు... రాష్ట్రంలో ప్రజలు క్షేమంగా ఉండాలి, ప్రజలకు భద్రత ఉండాలి, కుల చిచ్చు లేకుండా ప్రజలు ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటాను అని అన్నారు.