గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 13 నవంబరు 2022 (11:45 IST)

'జగనన్న ఇళ్ళు - పేదలందరికీ కన్నీళ్లు' పరిశీలనలో పవన్ కళ్యాణ్

pawankalyan
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వైకాపా ప్రభుత్వంతో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమైనట్టు కనిపిస్తున్నారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలను తూర్పారబడుతూ ప్రజలకు తెలియజేసే పనిలో నిమగ్నమయ్యారు. ఇందులోభాగంగా, ఆయన "జగనన్న కాలనీలు పేదలందరికీ కన్నీళ్లు" అనే కార్యక్రమం పేరుతో జగనన్న కాలనీల పరిశీలనకు శ్రీకారం చుట్టారు. 
 
గత రెండు రోజులుగా విశాఖపట్టణంలోనే ఉన్న పవన్ కళ్యాణ్ పార్టీ నేతలతో కలిసి ఆదివారం ఉదయం విశాఖ నుంచి విజయనగరం జిల్లా గుంకలంలో జగనన్న కాలనీల సందర్శనకు బయలుదేరారు. ఈ సందర్భంగా, జగనన్న కాలనీలు.. పేదల కన్నీళ్లు అనే కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. 
 
వైజాగ్ నుంచి పార్టీ నేతలతో కలిసి రోడ్డు మార్గంలో విజయనగరం బయలుదేరిన పవన్ కళ్యాణ్‌కు గుంకలాంలో జనసేన శ్రేణులు భారీ ఏర్పాట్లు చేసి ఘన స్వాగతం పలికారు. పవన్ కళ్యాణ్‌కు దారిపొడవునా స్వాగత సత్కారాలను ఏర్పాటు చేశారు. దారి వెంట తనకు అందుతున్న స్వాగత సత్కారాలను జనసేనాని స్వీకరిస్తూ పవన్ ముందుకు సాగుతున్నారు. ఆయన ఆదివారం మధ్యాహ్నానికి గుంకలాంకు చేరుకుంటారు. అక్కడ ఏర్పాటు చేసిన జగనన్న కాలనీని పవన్ పరిశీలిస్తారు. 
 
అలాగే, విశాఖ నుండి విజయనగరం జిల్లా, గుంకలాం గ్రామంలో "జగనన్న ఇళ్ళు - పేదలందరికీ కన్నీళ్లు" కార్యక్రమంలో పాల్గొనేందుకు బయలుదేరిన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌కు ఆనందపురంలో ప్రజలు, జనసైనికులు ఘన స్వాగతం పలికారు. భారీ గజమాలను క్రేన్ సాయంతో  పవన్‌కు వేశారు.