ఎస్వీఎస్ఎన్ వర్మ మద్దతుదారుల ఆందోళన... సర్దిచెప్పిన మాజీ ఎమ్మెల్యే!!
జనసేన పార్టీ అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ కోసం తన స్థానాన్ని త్యాగం చేసిన పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మకు టీడీపీ అధిష్టానం ఎమ్మెల్సీ టిక్కెట్ కేటాయించలేదు. దీంతో ఆయన అనుచరులు పిఠాపురంలో వీరంగం సృష్టిస్తున్నారు. జనసేన పార్టీ వల్లే తమ నేతలు ఎమ్మెల్సీ స్థానం రాలేదంటూ తమ అక్కసును వెళ్లగక్కుతున్నారు. నిజానికి పవన్ కోసం తన సీటును త్యాగం చేసిన ఎస్వీఎస్ఎన్ వర్మకు ఎమ్మెల్సీ ఖాయమంటూ చాలాకాలంగా ప్రచారం సాగుతోంది.
అయితే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ టీడీపీ అభ్యర్థుల జాబితాలో వర్మ పేరు లేదు. ఈ పరిణామంతో వర్మ తీవ్ర అసంతృప్తికి లోనయ్యారంటూ వార్తలు వస్తున్నాయి. దీనికి ఆజ్యం పోసేలా ఆయన అనుచరులు పిఠాపురం టీడీపీ కార్యాలయంలో వీరంగం సృష్టించారు. పార్టీ జెండాలను, ప్రచార కరపత్రాలను కుప్పగా పోసి తగలబెట్టారు. ఈ పరిణామాలను టీడీపీ అధిష్టానం నిశితంగా పరిశీలిస్తుంది.
ఈ నేపథ్యంలో వర్మ పిఠాపురంలో కార్యకర్తలతో కీలక సమావేశం నిర్వహించారు. తనకు ఎమ్మెల్సీ దక్కకపోవడానికి గల కారణాలను కార్యకర్తలకు వివరించారు. టీడీపీతో తన ప్రస్థానం 23 యేళ్లుగా కొనసాగుతుందని, పార్టీ అధినేత చంద్రబాబుతో కలిసి అనేక అంశాలపై పనిచేశానని గుర్తుచేశారు. చంద్రబాబు, నారా లోకేశ్ ఆదేశాలే తనకు, తమ కుటుంబ సభ్యులకు, పిఠాపురం టీడీపీ కార్యకర్తలకు శిరోధార్యమన్నారు. పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకున్నప్పటికీ దానికి కట్టుబడివుంటామని తెలిపారు.
రాజకీయాల్లో కొన్ని రకాలైన ఇబ్బందులు ఉంటాయని, నియోజకవర్గాల స్థాయిలో పదవుల పంపకం అంటే ఎంతో కష్టంతో కూడుకున్న పని అని, అదే రాష్ట్ర స్థాయిలో పదవులు పంపకం చేయాలంటే ఎన్ని ఇబ్బందులు ఉంటాయో తనకు తెలుసని అన్నారు. ఆ పరిస్థితులను అర్థం చేసుకుంటామని తెలిపారు.