గురువారం, 6 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 6 ఫిబ్రవరి 2025 (15:02 IST)

ఎదురెదురుగా ఉండి కొట్టుకోవడం ఎందుకని అసెంబ్లీకి వెళ్లడంలేదు.. జగన్

jagan - sai reddy
రాజకీయాల్లో కొనసాగాలంటే విశ్వసనీయత, నిజాయితీ, నిబద్ధత ముఖ్యమని, అది తనకైనా, విజయసాయిరెడ్డి రెడ్డికైనా మరొకరికైనా అని మాజీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి అన్నారు. వైకాపాకు ఆ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి రాజీనామా చేయడంపై జగన్ గురువారం స్పందించారు. బయటకు వెళ్లే ప్రతి రాజ్యసభ సభ్యుడుకి విశ్వసనీయత ఉండాలన్నారు. ప్రలోభాలకు లొంగో, భయపడో లేదా రాజీపడో వెళ్లిపోతే ఎలాగని ప్రశ్నించారు. రాజకీయాల్లో కష్టనష్టాలు ఉంటాయని, ఐదేళ్లు కష్టపడితే మన సమయం వస్తుందన్నారు. విజయసాయిరెడ్డికైనా, మరెవరికైనా విశ్వసనీయత, క్యారెక్టర్ ముఖ్యమన్నారు. 
 
అసెంబ్లీ సమావేశాలను తాము బహిష్కరించలేదని జగన్ ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. శాసనసభ సమావేశాలకు హాజరయ్యే విషయంలో కోర్టుకు కూడా వెళ్లామని గుర్తుచేశారు. అసెంబ్లీ సమావేశాలకు గైర్హాజరుపై వాళ్లు ఏం చేసుకున్నా వాళ్ల ఇష్టమన్నారు. ఎదురెదురుగా ఉండి కొట్టుకోవడం ఎందుకని అన్నారు. తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడంపై కోర్టుకు అసెంబ్లీ స్పీకర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 
 
మద్యం స్కామ్‌లో మిథున్ రెడ్డికి ఏం సంబంధం అని ప్రశ్నించారు. మిథున్ రెడ్డి తండ్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏ శాఖ అని, ఆయనకు లిక్కర్‌కు ఏం సంబంధం ఉందని అడిగారు. ఎవరినో ఒకరిని ఇరికించి కేసు పెట్టడం వాళ్లకు అలవాటేనని జగన్ విమర్శించారు.