శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 14 అక్టోబరు 2019 (20:28 IST)

తెలంగాణాలో రాష్ట్రపతి పాలనకు రంగం సిద్ధం..?

తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించడం ద్వారా గవర్నర్‌కు అధికారాలు కట్టబెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. దక్షిణాది రాష్ట్రాల్లో అధికారమే లక్ష్యంగా తెలంగాణపై దృష్టి సారించిన కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం తెలంగాణలో నెలకొన్న ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో శాంతిభద్రతల సమస్య ఉత్పన్నంకానుండడంతో రాష్ట్రపతి పాలన విధించేందుకు బీజేపీ ముఖ్యనేతలతో సమాలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. 
 
ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా శనివారం హైదరాబాద్‌లో జరిగిన బీజేపీ ఆందోళన కార్యక్రమంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ కంటికి గాయాలు కావడం, అరెస్టులతో పరిస్థితి ఉద్రిక్తం కావడం, ఖమ్మంలో ఆర్టీసీ డ్రైవర్లు ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం, ఒక డ్రైవర్ చావుబతుకుల్లో ఉండటంవంటి ఉద్రిక్త పరిస్థితులతో రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్య రావడంతో రాష్ట్రపతి పాలన విధించేందుకు కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. 
 
ముఖ్యమంత్రి కేసీఆర్‌పై తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో బీజేపీ దానిని అనుకూలంగా మార్చుకునేందుకు, కేసీఆర్ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసేందుకు కేంద్రం ఏ క్షణంలోనైనా రాష్ట్రపతి పాలన విధించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తోంది. అదే జరిగితే ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రభుత్వం లేకుండా గవర్నర్‌కు ప్రత్యేక అధికారాలు లభించనున్నాయి. గవర్నర్, పోలీసుల సారధ్యంలో రాష్ట్రంలో కొంతకాలం పాలన సాగనుంది.