గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 14 అక్టోబరు 2019 (20:06 IST)

కేసీఆర్ సర్కారుకు మొట్టికాయలు ... భవనాలు ఎందుకు కూల్చివేస్తున్నారు?

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఆ రాష్ట్ర హైకోర్టు మొట్టికాయలు వేసింది. సచివాలయ భవనాలను ఎందుకు కూల్చివేస్తున్నారంటూ నిలదీసింది. అగ్నిప్రమాదం పొంచివుందన్న కారణంతో ఆ భవనాలను కూల్చివేస్తారా? అంటూ ప్రశ్నించింది. 
 
ప్రస్తుతం ఉన్న సచివాలయాన్ని కూల్చి కొత్తది నిర్మించాలన్న తెలంగాణ సర్కారు నిర్ణయాన్ని హైకోర్టు తప్పుబట్టింది. తెలంగాణ సచివాలయం కూల్చివేతపై విశ్వేశ్వరరావు అనే వ్యక్తి దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టు సోమవారం విచారణ చేపట్టింది. 
 
ఈ సచివాలయాన్ని ఎందుకు కూల్చివేస్తున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఆ భవనానికి అగ్నిప్రమాదం ముప్పు ఉండడంతో కూల్చివేయాలన్న నిర్ణయం తీసుకున్నారని ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన అటార్నీ జనరల్ తెలిపారు. దీనిపై అగ్నిమాపకదళ శాఖ కూడా నివేదిక ఇచ్చిందని కోర్టుకు విన్నవించారు. 
 
అయితే, అగ్నిమాపక శాఖ నివేదికలో అగ్నిప్రమాదాల నియంత్రణకు చర్యలు చేపట్టాలని మాత్రమే ఉంది, భవనాలు కూల్చివేయాలని చెప్పలేదు అని కోర్టు వ్యాఖ్యానించింది. దాంతో, అన్ని ప్రభుత్వ శాఖలు ఒకే చోట ఏర్పాటు చేయాలన్నది ప్రభుత్వ నిర్ణయం అని ఏజీ పేర్కొనగా, ఏపీ ప్రభుత్వం ఖాళీ చేసిన భవనాలు ఉండగా కొత్తవాటితో పనేంటి? అని మరోసారి కోర్టు సూటిగా ప్రశ్నించింది. 
 
అదేసమయంలో పిటిషనర్ విశ్వేశ్వరావుకు కూడా కోర్టు అక్షింతలు వేసింది. పరిపాలన అంశాల్లో మీరు ఎలా జోక్యం చేసుకుంటారని ప్రశ్నించింది. ప్రజల ధనం దుర్వినియోగం అవుతోందన్న కారణంగా పిటిషన్ వేసినట్టు విశ్వేశ్వరరావు తరఫు న్యాయవాది బదులివ్వగా, సచివాలయ నిర్మాణం ప్రజల కోసం చేపడుతున్నదే కదా అని కోర్టు వ్యాఖ్యానించింది. ఇరు వర్గాల వాదనలు ఆలకించిన తర్వాత తదుపరి విచారణను కోర్టు రేపటికి వాయిదావేసింది.