ఆదివారం, 28 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 10 ఏప్రియల్ 2023 (08:40 IST)

తిరుపతిలో పేకాట ఆడుతూ చిక్కిన సీఐ - ఎస్ఐ అరెస్టు

playing cards
కొందరు పేకాట రాయుళ్లతో కలిసి పేకాట ఆడుతున్న సర్కిల్ ఇన్‌స్పెక్టర్, ఏఎస్ఐ‌ పోలీసులకు చిక్కారు. తిరుపతి జిల్లాలోని తిరుపతి గ్రామీణ మండలం రాఘవేంద్ర నగర్‌లో ఈ ఘటన జరిగింది. ఇక్కడ ఓ ఇంటిని అద్దెకు తీసుకుని దాన్ని పేకాట స్థావరంగా మార్చివేశారు. ఈ విషయం బయటకు పొక్కి పోలీసుల దృష్టికి వెళ్లింది. దీంతో ఆ ఇంటిపై పోలీసులు దాడి చేయగా, మొత్తం 13 మంది పేకాట రాయుళ్లను అదుపులోకి తీసుకున్నారు. 
 
అరెస్టు చేసిన వారిలో ఎర్రచందనం టాస్క్‌ఫోర్స్ సీఐ, ఒక ఏఎస్ఐతో పాటు మొత్తం 11 మంది ఉన్నారు. వీరి నుంచి భారీ మొత్తంలో డబ్బును స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడినవారిలో అధికార వైకాపాకు చెందిన నేతలు ఉన్నారు. ఈ కారణంగానే వారి అరెస్టు చేసిన వారి వివరాలను పోలీసులు వెల్లడించలేదు. ఈ విషయం జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి దృష్టికి వెళ్లింది. 
 
దీంతో అదే రోజురాత్రి పట్టణంలోని తూర్పు స్టేషన్‌లో ఏఎస్ఐగా పని చేస్తున్న జోగారావు, కార్పొరేటర్  ఆంజనేయులు, మరో తొమ్మిది మందిపై కేసు నమోదు చేశారు. అరెస్టు అయిన వారిలో నాగరాజు, డి.సురేశ్, డి.కిరణ్ కుమార్, పి.కృష్ణారెడ్డి, బి.చెంచుముని, ఎన్.శ్రీనివాసులు, కె.మునిప్రసాద్, కె.రాధాకృష్ణ, కార్పొరేట్ కె.ఆంజనేయులు, ఎస్. నరేంద్ర, ఏఎస్ఐ జోగారావు, సీఎం చంద్రశేఖర్‌లు ఉన్నారు. ఈ కేసుతో సంబంధం ఉన్న ఇద్దరు ప్రజాప్రతినిధులు తమ పలుకుబడితో కేసు నుంచి తప్పించుకున్నారు.