శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 10 ఏప్రియల్ 2023 (08:18 IST)

వామ్మో ఆంధ్రా రోడ్లా.. నరకాన్ని తలపిస్తున్నాయ్.. బీజేపీ ఎంపీ సోయం బాపురావు

soyam bapurao
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొన్న రహదారులపై తెలంగాణ రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎంపీ సోయం బాపురావు తనదైనశైలిలో స్పందించారు. వామ్మో.. ఆంధ్రా రోడ్లా.. నరకాన్ని తలిపిస్తున్నాయంటూ ఆయన తాజాగా చేసిన వ్యాఖ్యలు ఇపుడు చర్చనీయాంశంగా మారాయి. పైగా, పాడేరును తలచుకుంటే జాలేస్తుందంటూ వ్యాఖ్యానించారు. 
 
ఏపీలోని అల్లూరు సీతారామరాజు జిల్లా కేంద్రం పాడేరులో ఆదివారం జనజాతి సురక్ష మంచ్ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. బీజేపీ రాష్ట్ర గిరిజన మోర్ఛా అధ్యక్షుడు కురసా ఉమామహేశ్వర రావు, కేంద్ర ఫిలింబోర్డు సభ్యుడు చల్లా రామకృష్ణ తదితరులు కూడా ఇందులో పాల్గొన్నారు. 
 
ఈ సందర్భంగా బాపురావు విలేకరులతో మాట్లాడుతూ, ఆంధ్రా రోడ్లు మరింత అధ్వాన్నంగా ఉన్నాయన్నారు. 80 కిలోమీటర్ల దూరం ప్రయాణించేందుకు మూడున్నర గంటల సమయం పట్టిందన్నారు. తమ రాష్ట్రం వెనకబడివుందని అనుకున్నామని, కానీ, ఇక్కడ పరిస్థితులు మరింత దారుణంగా, అధ్వాన్నంగా ఉన్నాయని అన్నారు. ఏపీ రోడ్లు నరకాన్ని తలపిస్తున్నాయని అన్నారు. పాడేరువాసులలు విశాఖపట్టణం ఎలా వెళ్తున్నారో అర్థం కావడం లేదన్నారు.
 
రాష్ట్ర విభజన తర్వాత కూడా జిల్లా కేంద్రాలు అభివృద్ధి చెందకపోవడం దారుణమన్నారు. కొన్ని కొండ గ్రామాల్లో ఇంకా చదువుకోనివారు ఉన్నారంటే ఆశ్చర్య కలుగుతుందన్నారు. ముఖ్యమంత్రి జగన్ ఇప్పటికైనా రహదారుల అభివృద్ధి ప్రత్యేక దృష్టిసారించాలని ఆయన సూచించారు.