1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 17 మే 2021 (18:39 IST)

సుప్రీంకోర్టు ఆదేశాలను ఖాతరుచేయని ఏపీ సీఎం : రఘురామ లాయర్లు

సుప్రీంకోర్టు ఆదేశాలను ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ ఏమాత్రం ఖాతరు చేయడం లేడని వైకాపా రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు తరపు న్యాయవాదులు ఆరోపిస్తున్నారు. రఘురామను సికింద్రాబాద్‌ ఆర్మీ ఆస్పత్రికి పంపే బాధ్యతను సుప్రీంకోర్టు సీఎస్‌పై పెట్టినా వేగంగా స్పందించలేదని లాయర్లు వాపోయారు. 
 
ఎంపీ రఘురామ కృష్ణం రాజు కేసులో సుప్రీంకోర్టు కీలక సోమవారం ఆదేశాలు ఇచ్చింది. రఘురామ రాజుకు సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రిలో ముగ్గురు వైద్యులతో బోర్డు ఏర్పాటు చేసి వైద్య పరీక్షలు చేయాలని సుప్రీం కోర్టు సూచించింది. వైద్య పరీక్షలను వీడియోగ్రఫీ చేసి నివేదికను సీల్డ్ కవర్‌లో ఇవ్వాలని ఆదేశించింది. 
 
జ్యుడిషియల్ అధికారి పర్యవేక్షణలో రఘురామ రాజుకు వైద్య పరీక్షలు నిర్వహించాలని సూచించింది. జ్యుడిషియల్ అధికారిని తెలంగాణ హైకోర్టు నియమించాలని ధర్మాసనం ఆదేశించింది. అలాగే రఘురామకు వై కేటగిరీ భద్రతను కొనసాగించాలని సూచించింది. ఎంపీకి వైద్య పరీక్షల నిర్వహణ జరిగే కాలాన్ని జ్యుడిషియల్ కస్టడీగా పరిగణించాలని సుప్రీం కోర్టు సూచించింది. 
 
ఈ ఉత్తర్వులను ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కూడా పాటించాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ధర్మాసనం మే 21కి వాయిదా వేసింది. సుప్రీం ఆదేశాలతో ఎంపీ రఘురామకృష్ణం రాజును సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రికి తరలించాల్సివుంది. కానీ, ఏపీ సీఎం సుప్రీంకోర్టు ఆదేశాలు పట్టించుకోలేదు. 
 
దీనిపై రఘురామ లాయర్లు మాట్లాడుతూ, తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌తో తాము మాట్లాడామన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం తాము జ్యుడీషియల్‌ ఆఫీసర్‌ను నియమించామని కోర్టు అధికారులు రఘురామ లాయర్లకు చెప్పారు. త్వరలోనే ఉత్తర్వులు కూడా ఇస్తామన్నారని న్యాయవాది లక్ష్మీనారాయణ తెలిపారు. 
 
అలాగే, ఏపీ సీఎస్‌తో కూడా లక్ష్మీనారాయణ మాట్లాడారు. సోమవారం రాత్రిలోపు తరలిస్తామని సీఎస్‌ చెప్పారని, రఘురామ ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా త్వరగా తరలించాలని కోరితే ఆయన పెద్దగా స్పందించలేదన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేస్తామని సీఎస్‌ చెప్పారని లక్ష్మీనారాయణ తెలిపారు.