1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎంజీ
Last Updated : బుధవారం, 25 ఆగస్టు 2021 (20:16 IST)

ఇక కొత్త సాఫ్ట్ వేర్ తోనే రిజిస్ట్రేషన్లు: డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్

రిజిస్ట్రేషన్ల కార్యాలయాల్లో ఎలాంటి అవకతవకలకు తావులేకుండా కొత్త సాఫ్ట్ వేర్ సహాయంతోనే రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయని డిప్యూటీ సీఎం (రెవెన్యూ) ధర్మాన కృష్ణదాస్ అన్నారు. నకిలీ చలానాల కుంభకోణంపై ఆ శాఖ ఐజి శేషగిరి బాబుతో క్యాంపు కార్యాలయంలో సమీక్షించిన అనంతరం మాట్లాడారు.

అదనపు ఐజి ఆధ్వర్యంలో ఇప్పటికే ఒక ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసి రెండు దశలలో కుంభకోణానికి సంబంధించి మరిన్ని ఆధారాలు సేకరించామన్నారు. రాష్ట్రం మొత్తం మీద 11 జిల్లాలో 36 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సొమ్ము పక్కదారి పట్టినట్లు గుర్తించామని ఆ మొత్తం రూ.7,13,76,148ల గా ఉందని చెప్పారు.

దీనిలో ఇప్పటి వరకు రూ.3,38,11,190 వసూలు చేశామని వెల్లడించారు. సంబంధిత వ్యక్తులపై శాఖాపరమైన చర్యలు తీసుకున్నామని, ప్రమేయం ఉన్న ప్రైవేటు వ్యక్తులపై క్రిమినల్ చర్యలకు ఆదేశాలు జారీ చేశామని వివరించారు. బోగస్ చలాన్ల ద్వారా జరిగిన రిజిస్ట్రేషన్లపై ఏం చేయాలనే దానిపై న్యాయ సలహా కూడా తీసుకొంటున్నామని, అధికారులు దర్యాప్తును వేగంగా పూర్తి చేశారని అన్నారు.

రాష్ట్రంలోని అన్ని సబ్ రిజిస్టార్ కార్యాలయాల్లో కొత్త సాఫ్ట్‌వేర్ ద్వారానే రిజిస్ట్రేషన్లు సాగుతున్నాయని, రిజిస్ట్రేషన్ల సేవలు మరింత సులభతరం చేసేందుకు కృషి చేస్తున్నామని కృష్ణదాస్ పేర్కొన్నారు.