శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 25 జూన్ 2021 (13:27 IST)

ఏపీ నుంచి రిలయన్స్ వెనక్కి : రూ.15 వేల కోట్ల పెట్టుబడి ఫ్యాక్టరీ పాయె

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి రిలయన్స్‌ సంస్థ తేరుకోలేని షాకిచ్చింది. రిలయన్స్ ఏర్పాటు చేయదలచిన ఎలక్ట్రానిక్స్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ యూనిట్‌ ఏర్పాటు కోసం గ‌త స‌ర్కారు 136 ఎకరాలను కేటాయించింది. ఇందులో వైసీపీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక 75 ఎకరాలను సేకరించి అప్పగించింది. 
 
అయితే, రిలయన్స్‌కు కేటాయించిన భూములకు సంబంధించిన 15 మంది రైతులు ప‌లు కారణాలతో కోర్టులో కేసులు వేశారు. ఈ కేసులు పరిష్కారం అయ్యే వరకు యూనిట్‌ ఏర్పాటు చేయటానికి అవకాశం ఉండక‌పోవ‌డంతో రిల‌య‌న్స్ ఆ భూముల‌ను తిరిగి రాష్ట్ర మౌలిక సదుపాయాల కల్పనా సంస్థ(ఏపీఐఐసీ)కు వెనక్కి ఇచ్చేస్తూ తాజాగా కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. 
 
ఫలితంగా రూ.15 వేల కోట్ల పెట్టుబడితో సెట్‌టాప్‌ బాక్సులు, ఇంటర్నెట్‌ వినియోగానికి అవసరమైన డాంగిల్స్‌ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనను విరమించుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఈ విష‌యాన్ని తిరుపతి ఏపీఐఐసీ జోనల్‌ కార్యాలయ ఉన్నతాధికారులు ధ్రువీకరించారు. 
 
అదేసమయంలో ఆ భూముల కోసం రిల‌యన్స్ డిపాజిట్‌ చేసిన మొత్తాన్ని తిరిగి ఇచ్చే విష‌యంపై చ‌ర్చిస్తున్న‌ట్లు పేర్కొంది. అయితే, తిరుపతి సమీపంలో భూముల‌కు బ‌దులుగా వడమాలపేట మండలం పాడిరేడు అరణ్యం దగ్గర ఎలాంటి వివాదాలు లేని భూములను కేటాయిస్తామని రిల‌య‌న్స్ కు ఏపీఐఐసీ అధికారులు న‌చ్చ‌జెప్పే ప్ర‌య‌త్నం చేశారు.
 
అయిన‌ప్ప‌టికీ, ఆ సంస్థ నుంచి ఎలక్ట్రానిక్స్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ యూనిట్ ఏర్పాటుకు సానుకూల స్పందన రాలేదని ఓ అధికారి తెలిపారు. సెట్‌టాప్‌ బాక్సుల అసెంబ్లింగ్‌ యూనిట్‌ను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనను రిలయన్స్‌ సంస్థ విరమించుకుంది. అధికారులు జ‌రిపిన సంప్ర‌దింపులు ఫ‌లించ‌లేదు.